పనాజీ: గోవా అసెంబ్లీ అంతా కాసేపు ఉద్విగ్నంగా మారింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం తర్వాత కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్.. కన్నీళ్లు పెట్టుకున్నారు. మనోహర్ పారికర్ కు సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా ఏడ్చేయడంతో సభ మొత్తం నిశ్శబ్దం నిండిపోయింది. మాట్లాడినంత సేపు మధ్యమధ్యలో ఆగుతూనే ఉన్నారు. గుండెల నిండా బాధ నిండిపోవడంతో పలు సందర్భాలలో మాట పైకి రాలేదు. ‘‘కేవలం మనోహర్ పారికర్ వల్లే నేను ఇక్కడున్నాను. నేను ఆయన వల్లే ఎమ్మెల్యే అయ్యా, స్పీకర్ అయ్యా, చివరకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనవల్లే వచ్చింది’’ అని అసెంబ్లీ సమావేశంలో సావంత్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ బల నిరూపణ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బలపరీక్షలో సావంత్ సర్కారు ఇప్పటికే నెగ్గింది. అనంతరం పారికర్ సంతాప తీర్మానం చేపట్టారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి ఆయన సేవలను ప్రస్తుతించారు. తీర్మానం చేపట్టేటపుడు అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్.. పారికర్ ను దూరదృష్టి గల నాయకుడిగా అభివర్ణించారు. ఆయన పనితీరును ప్రతి ఒక్కరం అందిపుచ్చుకోవాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్ కావ్లేకర్ అన్నారు. పారికర్ దేశ రక్షణ మంత్రిగా పనిచేయడం పట్ల గోవా గర్వంగా భావిస్తుందని తెలిపారు. పారికర్ వారసత్వాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేశాయ్ చెప్పారు.