YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎవ్వరికీ అర్ధం కానీ రీతిలో సాగుతుంది. సీబీఐ ఒక మైండ్ గేమ్ ప్రకారం దర్యాప్తు చేస్తుందని కొందరికి అర్ధమవుతున్న.., సీబీఐ పై ఉన్న ఒత్తిళ్ల కారణంగా కావాలనే ఇలా జాప్యం చేస్తుందని కొందరికి అర్ధమవుతుంది.. మొత్తానికి విచారణ మాత్రం కీలక దశకు చేరుకుంది అనేది కచ్చితంగా చెప్పవచ్చు..! అయితే ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు అనేది విచారణ జరుగుతున్న తీరును చూస్తూ అర్ధం చేసుకోవచ్చు..! రాజకీయ ప్రమేయం లేని కేసు అయితే ఈ పాటికే సిట్ దర్యాప్తులోనో, సీబీఐ కేసు టేకప్ చేసిన తొలి నాళ్లలోనే కేసులు ఛేదించి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపించే వారు. ఈ కేసును ఛేదించే క్రమంలో సీబీఐ ఓ వినూత్న ఐడియా వేసింది. నేరుగా పెద్ద చేపను పట్టుకోకుండా చిన్న చేపను ఎర వేసే పని స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో భాగం వైసీపీ ముఖ్యనేతలకు అనుచరులుగా ఉన్న వారిని సీబీఐ పదేపదే విచారణ చేస్తున్నది. కొందరిని ఈ కేసులో అరెస్టు చేస్తున్నట్లుగా కూడా లీక్ లు ఇస్తోంది సీబీఐ.
YS Viveka Case: చిన్న కార్యకర్తకు పెద్ద స్థాయిలో ఇంటరాగేషన్..!?
వైసీపీ కార్యకర్తగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ గడచిన 45 – 50 రోజులుగా విచారణకు పిలిపిస్తూనే ఉంది. అతనితో పాటు వివేకా ప్రదాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, వాచ్ మెన్ రంగన్న, ఆసుపత్రి ఎండిగా ఉన్న ప్రసాదరెడ్డిలను విచారణకు పిలిచి విచారించింది. ఇలా చిన్న చిన్న వాళ్లను సీబీఐ పిలిచి విచారిస్తున్నది కానీ సునీతా రెడ్డి అనుమానితుల జాబితాలో పేర్కొన్న కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి లను మాత్రం విచారణకు పిలవలేదు. వీళ్లను విచారించాలంటే ముందుగా వీళ్ల అనుచరులను విచారించి వాళ్ల వద్ద నుండి పూర్తి సమాచారాన్ని రాబట్టి కొన్ని ఆధారాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న తరువాత వాళ్ల విచారణకు పిలవాలని సీబీఐ భావిస్తున్నట్లు ఉంది. సిబీఐ అధికారులు అనుమానించినట్లే ఓ సంఘటన ఇప్పుడు జరిగింది.
* గుమ్మడి కాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నట్లు..అన్న సామెత మాదిరిగా సునీల్ కుమార్ యాదవ్ విషయంలో సీబీఐ అధికారుల అనుమానం నిజం అయ్యింది. వైసీపీ చిన్న కార్యకర్త అయిన సునీల్ కుమార్ ను అనుమానించి సీబీఐ అధికారులు వారి స్టైల్ లో విచారించారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. తనపై సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనీ, లైడిటెక్టర్ పరీక్షలు చేశారనీ, వివేకా హత్య కేసును తనపై బనాయించి అరెస్టు చేసే ఆలోచనలో సీబీఐ అధికారులు ఉన్నారనీ, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సీబీఐ అధికారులు తనను విచారణకు పిలవకుండా చూడాలని, ఒక వేళ విచారణకు పిలిస్తే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సునీల్ కుమార్ కోర్టును అభ్యర్థించాడు. ఓ సాధారణ కార్యకర్త ఈ విధంగా హైకోర్టును ఆశ్రయించాడు అంటే అతని వెనుక బలమైన నాయకుడు ఏవరో ఉన్నారు అని సీబీఐ రూడికి వచ్చింది.
సునీల్ తోక ఈదుతూ చాలా మంది..!?
ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ తో సన్నిహితంగా ఉండే వంశీ, గోవర్థన్ తదితర వ్యక్తులను నిన్న సీబీఐ పిలిచి విచారణ చేసింది. సునీల్ కుమార్ యాదవ్ నెట్ వర్క్ ను ఛేదిస్తే అతనిని నడిపిస్తుంది ఎవరు అనేది సీబీఐకి ఆధారం దొరుకుతుంది. వాచ్ మెన్ రంగన్న తదితరుల ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పెడితే హంతకులు ఈజీగా బయటకు వస్తారని, అందుకే హంతకులను అష్టదిగ్బంధం చేసే ఆలోచనలో భాగంగా బలమైన ఆధారాల సేకరణలో సీబీఐ నిమగ్నమై ఆ దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నది. వివేకా హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది కొంత మేర సమాచారం రాబట్టిన సీబీఐ అందుకు సంబంధించి బలమైన ఆధారాల సేకరణ చేస్తున్నది. వారం పది రోజుల్లో ఈ కేసును ఛేదించి అసలైన ధోషులను పట్టుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.