Election commission of India: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన హూజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు ఏపిలో బద్వేల్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. బెంగాల్ లో మూడు అసెంబ్లీ, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం తెలంగాణలోని హుజూరాబాద్, ఏపిలోని బద్వేల్ ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం సమావేశం అయ్యింది. ఈ సందర్భంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఉప ఎన్నికల నిర్వహణకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
అయితే తెలంగాణ, ఏపితో సహా పది రాష్ట్రాల సీఎస్ లు పండుగల సీజన్ ముగిసిన తరువాత ఉప ఎన్నికలు నిర్వహించాని సూచించాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ లోని మూడు అసెంబ్లీ స్థానాలు భవానీ పూర్, జంగీపూర్, శంషేర్ గంజ్ స్థానాలకు, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండగా 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నది. వచ్చే నెల మూడవ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనున్నది.
ఇక తెలంగాణలోని హుజూరాబాద్, ఏపి కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికను దసరా తరువాత అంటే అక్టోబర్, నవంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. ఏపి, తెలంగాణలో ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కోరినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మృతితో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.