CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి విశాఖపట్నం బయలుదేరనున్నారు సీఎం జగన్, సాయంత్రం 5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన మరో ఆరు ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తదుపరి ఆరు గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్య నాయుడు వివాహ వేడుకలో హజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. ఆ తరువాత 6.20 గంటలకు ఉడా పార్క్ వద్ద పార్క్ తో పాటు మరో నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ నందు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనుమరాలు నిహారిక వివాహ రిసెప్షన్ కు హజరై నూతన వధువరులను ఆశీర్వదిస్తారు. రాత్రి 8గంటలకు విశాఖ నుండి గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు.
CM YS Jagan: నేటి విశాఖ పర్యటనకు ప్రత్యేకత
సీఎం వైఎస్ జగన్ నేటి విశాఖ పర్యటనకు ప్రత్యేక ఉంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న తరువాత తొలిసారిగా సీఎం జగన్ విశాఖలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంలో రాజధాని అంశంపై విశాఖ ప్రజలకు క్లారిటీ ఇస్తారా, విశాఖ ప్రజలకు ఆయన ఏమి సమాధానం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ మూడు రాజధానులకు కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ వివాదం కోర్టులో ఉండటంతో సీఎం జగన్ విశాఖ ప్రజలను ఉద్దేశించి ఇంత వరకూ మాట్లాడలేదు. తొలిసారిగా సీఎం జగన్ అధికార, అనధికార కార్యక్రమాలకు విశాఖకు వస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు విశాఖకు వచ్చినా అటు శారదా పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సుల కోసమో లేక ఒడిశా, శ్రీకాకుళం వెళ్లూ విశాఖలో ఆగడమో తప్ప నేరుగా విశాఖకు అధికారిక కార్యక్రమాలకు వచ్చిన సందర్భం లేదు.