Brother Anil Kumar: బ్రదర్ అనిల్ కుమార్.. క్రైస్తవ, బీసీ సంఘాల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించడం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. రాజకీయ, కుటుంబ పరమైన విషయాలపై ఉండవల్లితో చర్చించినట్లు ఆయన ఆనాడు తెలిపారు. ఇటీవల విజయవాడలో క్రైస్తవ, బీసీ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. దీంతో ఏపిలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారం మరువకముందే నేడు విశాఖలోని ఓ హోటల్ లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన తరువాత..బ్రదర్ అనిల్ ఏపిలో తరచు పర్యటనలు చేస్తూ బీసీ, మైనార్టీ, క్రైస్తవ సంఘాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
Read More: Brother Anil: షర్మిల భర్త పొలిటికల్ పావులు..!? పార్టీ కాదు.., కానీ జగన్ కి వ్యతిరేక కూటమి..!?
Brother Anil Kumar: క్రైస్తవ సంఘాల ప్రతినిధులకు ఇబ్బందులు
ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆమె సోదరి వైఎస్ షర్మిల మధ్య గ్యాప్ ఏర్పడిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో బ్రదర్ అనిల్ ఏపిలో పర్యటనలు చేస్తుండటంతో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారు అంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనను అభిమానించే వర్గాల వారు పార్టీ పెట్టాలని వత్తిడి చేస్తున్నారని సమాచారం. ఈ సందర్భంలో బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు తనతో వారి బాధలు చెప్పుకున్నారన్నారు. వారి సమస్యలను పట్టించుకునే వారు లేరని అన్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
పార్టీ పెట్టాలన్న డిమాండ్ ఉంది
జగన్ బిజీగా ఉండటం వల్ల రెండున్నరేళ్లుగా కలవలేదన్నారు. సమయం కుదిరినప్పుడు కచ్ఛితంగా కలుస్తానని తెలిపారు. తనను కలిసిన వాళ్లకు సాయం చేస్తానని హామీ ఇచ్చాననీ, మాట ఇస్తే కచ్ఛితంగా వెనక్కు తగ్గకుండా నిలబడతానని చెప్పారు. పార్టీ పెట్టాలని కూడా డిమాండ్ కూడా ఉందని తెలిపారు. తాను పార్టీ పెట్టకపోతే వాళ్లే పార్టీ పెడతామని అంటున్నారనీ, వాళ్లు పార్టీ పెడితే తాను మద్దతు ఇస్తానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఏపిలో పార్టీపై స్పష్టత ఇస్తానని అన్నారు బ్రదర్ అనిల్.