భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పసిడి పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాల్గవ స్థానానికి ఎగబాకింది. ఈ రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడా కు చెందిన మిచెల్లీ లీ పై ఘన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13 తో అలవోకగా నెగ్గింది. దీంతో వరుస గేమ్స్ తో ఆధిపత్యం చెలాయించి భారత్ కు మరో పసిడి అందించింది. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధుకు తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకు ముందు 2014 లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా, 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ అంశంలో సింధుపై మొదటి నుండి పసిడి ఆశలు ఉన్నాయి. ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని భారత శిబిరం నమ్మకం ఉంచింది. అటు అభిమానులు కూడా సింధు కామన్వెల్త్ స్వర్ణం అందుకోవాలని ఆకాక్షించారు. అందరి ఆంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ సింధు కామన్వెల్త్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేతగా అవతరించింది.
కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని కైవశం చేసుకున్న పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తొంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా సింధును ట్విట్టర్ వేదికగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత పీవీ సింధు అద్భుతంగా ఆడి ఛాంపియన్ గా నిలిచిందని ప్రధాని మోడీ ప్రశంసించారు.