ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపి అసెంబ్లీ లో రగడ చోటుచేసుకుంది. అయిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు .. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు ఎలా మారుస్తారు అంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు .. హెల్త్ వర్శిటీ పేరు మార్చవద్దంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరును వైసీపీ సభ్యులు తప్పుబట్టారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సభ్యులకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
టీడీపీ సభ్యులు కావాలనే సభలో రగడ చేసి బయటకు వెళ్లాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు పై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ సభ్యులకు సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పేర్లు మార్పు చేస్తే తాము అభ్యంతరం చెప్పలేదని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఏదో ఒకటి సమస్యగా చూపి సభలో అంతరాయం కల్గించడం టీడీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. స్పీకర్ పై పేపర్లు చింపి విసిరివేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుల నిరసనతో వైసీపీ సభ్యులు వెల్ లోకి వచ్చారు. ఇరుపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను కొద్ది సేపు వాయిదా వేశారు.
కాగా అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన బుదవారం ప్రభుత్వం తొమ్మిది బిల్లులను ప్రవేశపెట్టనుంది. 2021 – 21 సీజన్ కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వ్యవసాయ అనుబంధ రంగాలపై చర్చ సాగనుంది.