పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తే పర్యావరణ సమస్యలు, పొరుగు రాష్ట్రాల లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సంబంధిత రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించింది. ఏపి, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గడ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం రాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాాణానికి సంబంధించి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను వివరించారు. ముంపు ప్రభావంపై మరో సారి అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై ఇప్పటికే రెండు సార్లు అధ్యయనం చేశామని కేంద్రం తెలిపింది. పోలవరం వల్ల భద్రాచలంకు ముంపు ఉండదని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
గోదావరి ట్రిబ్యునల్ కు కట్టుబడే పోలవరం కడుతున్నట్లు పీపీఏ చైర్మన్ అర్కే గుప్తా తెలిపారు. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాలు సంయుక్త సర్వేకు సహకరించాలని కోరగా సంయుక్త సర్వేకు ఒడిశా అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. పోలవరం కట్టినా గోదావరి వరద ముంపులో తేడా ఉండదని, ఇప్పటికే బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయించామని తెలిపారు. ఒడిశాతో పాటు తెలంగాణ కూడా పలు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో అక్టోబర్ 7న నాలుగు రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని జలశక్తి శాఖ పేర్కొంది.