AP Politics: ఏపి రాజకీయ వర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తుల అంశం హాట్ టాపిక్ గా ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక మూలంగా అధికార వైసీపీకే లాభం చేకూరుతుందనే మాట వినబడుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి జనసేనతో జత కట్టాలనీ టీడీపీ, టీడీపీతో కలిసి పోటీ చేయాలని జనసేన భావిస్తున్నా బీజేపీ ప్రతిబంధకంగా తయారు అయ్యింది. కేంద్రంలో అధికారంలో ఉండటం, వ్యవస్థల తోడ్పాటు ఉండటం మూలంగా బీజేపీతో కయ్యం పెట్టుకోవడానికి రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సిద్దంగా లేవు. బీజేపీతో మరో సారి పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ఆశపడుతున్నా ఆ పార్టీ సిద్దంగా లేదు. ఏపి బీజేపీ నేతలు పలువురు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు తదితరులు పదేపదే ఈ విషయాన్ని చెబుతున్నారు. అధికార వైసీపీ మాత్రం బీజేపీకి పరోక్షంగా సహకారం అందించేందుకు, పరోక్షంగా సహకారం పొందే ప్రయత్నంలో ఉంది.
2014 ఎన్నికల పొత్తులు (టీడీపీ జనసేన బీజేపీ) పునరుద్దరణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ఒక వేళ బీజేపీ కలిసి రాకపోతే, టీడీపీతో కలిసి వెళ్లడానికైనా పవన్ సిద్దపడుతున్నారనేది టాక్. బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోమని చెబుతోంది. ఇది ఆ పార్టీలోని కొందరు నేతలకు నచ్చడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా తామే అధికారంలోకి వచ్చేది తామే అంటూ బీజేపీ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కైవశం చేసుకోలేకపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరకపోతే తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు కీలక నాయకులు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, లేదా జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న టాక్ వినబడుతోంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరే అవకాశం ఉందన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి. విశాఖ నుండి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరి ఆయన కానీ ఆయన కుమారుడు గానీ విశాఖ నార్త్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న గంటా శ్రీనివాసరావు తమ రాజకీయ ఎత్తులు, సంప్రదాయాన్ని అనుసరించి వేరే నియోజకవర్గాని మారతారని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా మంత్రిగా పని చేసిన బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా ఆ పార్టీలో కొనసాగే అవకాశం లేదని పేర్కొంటున్నారు.
వీళ్లతో పాటు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగే అవకాశం లేదు. ఆయన ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారుట. అదే విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ( గోనుగుంట్ల సూర్యనారాయణరెడ్డి) కూడా బీజేపీ నుండి టీడీపీలో చేరే అవకాశం ఉంది. అదే విధంగా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీళ్లతో పాటు టీడీపీ రాజ్యసభ సభ్యులుగా గెలిచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, సుజనా చౌదరిలు కూడా ఆ పార్టీ కొనసాగడం అనుమానమేనంటున్నారు. ఇలా కీలక నేతలు గుడ్ బై చెబితే బీజేపీలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో మొదటి నుండి ఆ పార్టీలో ఉన్న సోము వీర్రాజు, జీవిఎల్ నర్శింహరావు లాంటి వారు మాత్రమే మిగులుతారనేది నిర్వివాదాంశం.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!