తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నివాసంలో మంగళవారం తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియా ప్రచారాన్ని నేతలు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దని, పార్టీ బలోపేతం దృష్టి సారించాలని తెలిపారు. అంతర్గత విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉందని, కావున చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి ఐక్యంగా పని చేయాలని ఆదేశించారు. మార్చి నుండి సెప్టెంబర్ వరకూ కార్యాచరణ ఇచ్చారు. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయి బహిరంగ సభ నిర్వహించాలని అమిత్ షా సూచించారు. పార్టీలో చేరికలను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ ఏడాది ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్దం కావాలని నేతలకు బీజేపీ అధిష్టానం సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీఆర్ఎస్ నేతలను ఎండగట్టాలని నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది.