ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసంలో సమావేశమైన వీరు జాతీయ రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం పరిణామాలు, వివి ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పు, ఈవిఎంల విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు, ఐదు దశల ఎన్నికలలో జరిగిన పోలింగ్ సరళి ఆధారంగా ట్రెండ్ ఎలా ఉంది తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఎన్నికలు పూర్తి అయిన తరువాత అనుసరించాల్సిన వ్యూహాలు, తాజా రాజకీయ పరిణాలపై సుమారు 30 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది.
నిన్న సుప్రీం కోర్టులో జరిగిన వివి ప్యాట్ల లెక్కింపు అంశంపై రివ్యూ పిటిషన్ విచారణకు ఇక్కడకు వచ్చిన చంద్రబాబు మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. తదుపరి రాహుల్తో సమావేశం అవ్వాలని భావించినా ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంలో నేడు కలిసి చర్చించారు. అనంతరం చంద్రబాబు పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బయలుదేరి వెళ్లారు.