అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అంతా ఆన్లైన్లో ఉందనీ, ఎవరైనా చూసుకోవచ్చని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను కలిసి వినతి పత్రం సమర్పించడంతో పాటు పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సమాచారం ఆన్లైన్లో ఉంచామని ఉమా చెప్పారు. కెవిపిపై అమెరికాలో చాలా కేసులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసిపి గెలుపు కోసం కెవిపి కుట్రలు పన్నారని ఉమా అన్నారు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తారని ఉమా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జగన్ కోట్లు ఖర్చు పెట్టారనీ ఆయన కుట్రలకు అడ్డులేకుండా పోతోందని ఉమా విమర్శించారు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్లో పాల్గొన్నారని ఉమా చెప్పారు.
ప్రశాంత్ కిషోర్, జగన్, విజయసాయిరెడ్డి పాపాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఉమా అన్నారు.
పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవిఎంల మరమ్మతుల కోసం ఆరు గంటల సమయం తీసుకున్నారనీ, ఒక ఈవిఎం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయడానికి అంత సమయం అవసరమా అని ఉమా ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్కు ఈసీ ఆదేశించిందంటే ఇది కేవలం బిజెపి, వైసిపి కుట్రేనని ఉమా ఆరోపించారు.