YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వైసీపీ), సీఎం రమేష్ (బీజేపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ) ల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది.
దీంతో ఈ మూడు స్థానాలకు మార్చి నెలలో ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ఉన్న బలం ప్రకారం మూడు స్థానాలు వైసీపీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే వారి స్థానంలో ముగ్గురు అభ్యర్ధులను సీఎం జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తొంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. ఇటు అసెంబ్లీకి, అటు లోక్ సభకు అభ్యర్ధులుగా ఎంపిక చేయని సీనియర్ లకు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ, లేదా నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ సీట్లకు ముగ్గురి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సభ్యుల్లో ఒకరు ఎస్సీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారుట. ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, రాబోయే ఎన్నికల్లో టికెట్ లు దక్కని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజ్యసభకు ఈ ముగ్గురిని పంపుతారనే ప్రచారం వైసీపీ ప్రజా ప్రతినిధుల మధ్య వినబడుతోంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యనేతలతో సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. త్వరలో ఈ ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇద్దరు సిట్టింగ్ లకు ఎమ్మెల్యే టికెట్ దక్కక పోయినా ఆరేళ్ల పదవీకాలం ఉన్న రాజ్యసభ దక్కుతుందటం విశేషం.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టీడీపీ కూడా ఒక రాజ్యసభ స్థానానికి అభ్యర్ధిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది. రాజ్యసభ అభ్యర్ధి గెలుపొందడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోయినా వైసీపీని ఇరుకున పెట్టి క్రాస్ ఓటింగ్ ద్వారా లబ్దిపొందాలన్న భావనతో టీడీపీ రాజ్యసభ అభ్యర్ధిపై దృష్టి పెట్టిందని అంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత పార్టీలో చర్చించి రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నాల్గో అభ్యర్ధిని టీడీపీ పోటీకి దింపితే మాత్రం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
YS Jagan: ఊరిపి ఉన్నంత వరకూ జగనన్న బాటలోనే – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!