అమరావతి: నూతన ప్రభుత్వం ప్రజావేదిక నిర్మాణం విషయంలో చంద్రబాబును దోషిగా నిలపాలని ప్రయత్నిస్తోంది. ప్రజావేదికకు సంబంధించిన ఫైల్ను సిఎం జగన్ టేబుల్కు సిఆర్డిఎ అధికారులు పంపారు. ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల కేటాయింపు తదితర అంశాలను నివేదికలో పేర్కొన్నారు. భవన నిర్మాణం కోసం జలవనరుల శాఖ నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదని సిఆర్డిఎ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. నదీ గరిష్ట వరద నీటి మట్టం కన్నా ఈ ప్రాంతం దిగువన ఉన్నందున ప్రజావేదిక నిర్మాణానికి కృష్ణానది సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్ అనుమతికి నిరాకరించారని నివేదికలో పేర్కొన్నారు. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఖరారు కాగా నిర్మాణం పూర్తి అయ్యే సరికి ఏడు కోట్ల 59లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని నివేదికలో పొందుపర్చారు. ఈ నిర్మాణానికి సంబంధించి మొత్తం 15 అంశాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి సిఆర్డిఎ అధికారులు అందజేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉండవల్లిలోని ఆయన నివాసానికి అనుబంధంగా ప్రభుత్వ నిధులతో ప్రజావేదిక నిర్మాణం చేశారు. అది ప్రభుత్వ ఆస్తి కావడంతో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ భవనాన్ని తనకు కేటాయించాలని కోరుతూ సిఎం జగన్మోహనరెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై జగన్ ఏటువంటి నిర్ణయం ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలోనే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు వైసిపి నేతలు చంద్రబాబు నివాసం ఉన్న భవనంతో పాటు ప్రజావేదిక కూడా అక్రమ నిర్మాణాలేనని ఆరోపణలు చేశారు. చంద్రబాబును ఆ నివాసం నుండి ఖాళీ చేయిస్తామని కూడా ప్రకటించారు.
కాగా సోమవారం కలెక్టర్ల సమావేశం నిర్వహణకు ప్రభుత్వం ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నది. ప్రజావేదకలో ఉన్న చంద్రబాబు సామానును బయటకు తరలించారు. ఈ సందర్భంలో ప్రభుత్వ చర్యలను టిడిపి నేతలు తీవ్రం విమర్శించారు. వీరి విమర్శలను అధికారపక్షం తిప్పికొట్టింది. మంత్రులు బొత్సా సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్లు ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అని స్పష్టం చేశారు. ఈ పరిణామాల క్రమంలో దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.