అమరావతి: రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి వచ్చి చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్పై చర్చకు అసెంబ్లీలో బుగ్గన బుధవారం సమాధానమిస్తూ రాజధానికి తొలి బడ్జెట్లో 500కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వం కేవలం 277కోట్లు మాత్రమే కేటాయించిందని బుగ్గన అన్నారు. రాజధాని నిర్మాణం కోసం గత ఐదేళ్లలో 1700కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో సగానికిపైగా కేంద్రమే ఇచ్చిందని బుగ్గన వివరించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కేటాయింపు, చేసిన ఖర్చులను వివరిస్తూ ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల వివరాలు మంత్రి తెలియజేశారు. కేవలం ఐదు శాతం వడ్డీ లేని రుణాలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని బుగ్గన అన్నారు.
తొలి బడ్జెట్లోనే 80శాతం హామీలకు కేటాయింపులు చేశామని బుగ్గన చెప్పారు.
గతంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా మొట్టమెదటి సారిగా రాష్ట్రంలో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టి 6556కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తుంటే ప్రతిపక్షం దానినీ విమర్శించడం విడ్డూరంగా ఉందని బుగ్గన అన్నారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామికరంగం, సాగునీరు వంటి కీలక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామనీ, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామని బుగ్గన వివరించారు.
బడ్జెట్పై చర్చ అనంతరం శాసనసభను గురువారానికి వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు.