అమరావతి: పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలలో అవినీతిపై చంద్రబాబును వదిలే ప్రశ్న లేదనీ, తిన్నది అంతా కక్కిస్తామనీ వైసిపి రాజసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. అర్జంట్గా విజయసాయి రెడ్డి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటూ బుద్దా హితవుపలికారు.
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కల్పతరువుగా భావించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. అంచనాలు పెంచి ప్రతి పనిలో నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు జల విద్యుత్కేంద్రం నిర్మాణంలో 2343 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు అదనంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చిందనీ, ఇదీ కక్ష సాధింపేనంటారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
పోలవరంపై రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి చెప్పిన సమాధానాన్ని చంద్రబాబుకు అనుచరులు సరిగా చెప్పినట్లు లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిబిఐ రంగంలోకి రాదని బాబు మురిసిపోతున్నారమో అని విజయసాయిరెడ్డి అన్నారు.
ఈ విమర్శలపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ‘వీసా రెడ్డికి తెలీదు.చెబితే అర్థం చేసుకోరు. మీ కేసులో సిబిఐ లెక్కలతో చూపించిన 43వేల కోట్ల రూపాయల అవినీతి ఏమో తప్పుడు లెక్క అంటారు.పార్లమెంట్లో పోలవరంపై మీ అనుమానాలన్నీ కేంద్రమే తీర్చాక కూడా పోలవరంలో అవినీతి అంటూ మీరు రాసిన ట్విట్టర్ లెక్క రైట్ అంటారు. మీరు ముందుగా ట్రీట్మెంట్ తీసుకోండి. లెక్కల సంగతి తీరిగ్గా ఆలోచించవచ్చు’ అంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
దీనిపై మళ్లీ స్పందించిన విజయసాయిరెడ్డి ‘పోలవరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైన కేంద్రం క్లీన్ చిట్ వచ్చినట్లు మురిసిపోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపికపట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల కోట్ల రూపాయలు కక్కిందాకా ప్రభుత్వం వదిలి పెట్టదు’ అంటూ హెచ్చరించారు.