న్యూఢిల్లీ: కశ్మీర్కు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అలాగే మహ్మద్ అలీం సయ్యద్ అనే విద్యార్థి కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాఖలైన వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. సీతారం ఏచూరితోపాటు, విద్యార్థి సయ్యద్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించింది. ఈ సందర్భంగా..కశ్మీర్ వెళ్లేందుకు సీతారం ఏచూరిని అనుమతిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి తెలిపారు. కశ్మీర్లో ఉన్న తన మిత్రుడు, సీసీఐ(ఎం) నేత యూసుఫ్ తరిగామిని మాత్రమే కలుసుకోవాలని, ఇందులో రాజకీయ కోణం ఉండకూడదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిచవద్దని ఆదేశించించారు. ఇదే అంశంలో పిటిషన్ వేసిన మొహమ్మద్ అలీం సయ్యద్ తన పేరెంట్స్ను కలుసుకునేందుకు అనంత్నాగ్ వెళ్లవచ్చు అంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సయ్యద్కు రక్షణ కల్పించాలని కశ్మీర్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఇటీవల సీతారం ఏచూరి కాశ్మీర్ కు వెళ్లగా.. ఆంక్షల పేరుతో ఆయనను అడ్డుకుని ఎయిర్ పోర్ట్ నుంచి తిగిరి పంపిన సంగతి తెలిసిందే. జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ అగస్ట్ 5న కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు 50 వేలకు పైగా బలగాలను అక్కడికి మోహరించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ చేశారు. మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, జమ్ముకాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నేతలు సజ్జాద్ లోన్, ఇమ్రాన్ అన్సారీ తదితరులను అరెస్టు చేశారు.