అమరావతి: ఆర్థిక నేరాల కేసుల విచారణలో కోర్టుకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్థనను సిబిఐ అత్యంత తీవ్రంగా వ్యతిరేకించడం చాలమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బిజెపితో జగన్ సత్సంబంధాలు నెరపుతున్న కారణంగా సిబిఐ కాస్త ఉదాశీనంగానే ఉండవచ్చని అనుకున్నారు. కానీ సిబిఐ చాలా కఠినమైన వైఖరి తీసుకున్నది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా ఉందా అన్న అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుందనీ ఇటీవలి కాలంలో బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణ. జగన్మోహనరెడ్డిపై కేసులు నమోదు చేసినప్పుడు కూడా నాడు కేంద్రంలోని కాంగ్రెస్ కుట్రపూరితంగా ఈ చర్యలు చేపట్టిందని ఆరోపించిన విషయం తెలిసిందే.
హైదరాబాదులోని సిబిఐ న్యాయస్థానంలో మంగళవారం సిబిఐ జగన్ అభ్యర్థనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ పిటిషన్ విచారణార్హం కాదనీ, దానిని కొట్టివేయాలనీ కోరింది. జగన్కు మినహాయింపు ఇస్తే ప్రభుత్వాధినేతగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అభ్యంతరం తెలిపింది.
జగన్ వాస్తవాలను దాచిపెట్టి కోర్టును ఆశ్రయించారనీ, అభియోగపత్రాలు దాఖలై ఆరేళ్లయినా విచారణ ప్రారంభం కాలేదనీ, జగన్ ఏదో నెపంతో విచారణ జాప్యం చేయగలరనేందుకు ఇదే నిదర్శనమని సిబిఐ పేర్కొన్నది. జగన్ తన పిటిషన్లో పేర్కొన్న ఏపి పునర్విభజన, గత ప్రభుత్వ పనితీరు అంశాలు ఈ కేసుతో సంబంధం లేనివనీ, ఆయన వ్యక్తిగత హోదాలోనే నిందితుడిగా ఉన్నారని సిబిఐ స్పష్టం చేసింది. ఆర్థిక నేరాన్ని తీవ్రంగా పరిగణించాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొన్నదని గుర్తు చేసింది. జగన్పై నమోదైన అభియోగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపే తీవ్రమైన నేరాలుగా గతంలోనే చెప్పినట్లు పేర్కొన్నది.
విజయవాడ నుండి వారానికి ఒక సారి న్యాయస్థానానికి రావడానికి కష్టమవుతుందనడం సరికాదని అభిప్రాయపడింది. ఎంపిగా సాక్షాలను తారుమారు చేసే రాజకీయ, ఆర్థిక బలం ఉందనే ఆయన్ను గతంలో అరెస్టు చేశామనీ, ఇప్పుడు అలాంటి అవకాశం మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నది. సాక్షులుగా ఉన్న అధికారులు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఆధీనంలోనే ఉన్నారనీ, కేసులోని ప్రైవేటు సాక్షులు ఎక్కువగా ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులేనని స్పష్టం చేసింది. సిఎం కుమారుడుగా అక్రమ ఆర్థిక లావాదేవీలు చేశారనేది ఆయనపై అభియోగం కాగా ఇప్పుడు పూర్తి అధికారాలతో ఆయనే సిఎంగా ఉన్నారని పేర్కొన్నది. ఎంత పెద్దవారైనా చట్టానికి కట్టుబడి ఉండాలని గుర్తు చేసేందుకే వారానికోసారి హజరు నిబంధన ఉందని స్పష్టం చేస్తూ ప్రజాప్రయోజనాల కోసం జగన్ అభ్యర్థనలన్నింటినీ తిరస్కరించాలని సిబిఐ కోరింది.
బెయిల్ కోరినప్పుడు అంగీకరించిన షరతులకు జగన్ కట్టుబడి ఉండాలనీ, అత్యవసర పరిస్థితులు ఉంటే ఆ రోజు మినహాయింపు కోరవచ్చనీ పేర్కొన్నది. విచారణలో జాప్యం జరుగుతోందన్న కారణంగా మినహాయింపు కోరడం సమంజసం కాదనీ, హైకోర్టులో గతంలో ఇలాంటి పిటిషన్ను కొట్టివేసిందనీ సిబిఐ గుర్తు చేసింది.
సిఎం జగన్మోహనరెడ్డి అభ్యర్థనపై సిబిఐ ఇంత తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాశమైంది.
ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు తొలిసారి ఢిల్లీకి వెళ్లిన వైఎస్ జగన్ నాడు ప్రధాని మోదిని అభినందించి వచ్చిన కొద్ది సేపటికే విలేఖరుల సమావేశంలో బిజెపికి ఇంత భారీ మెజార్టీ రాకుండా ఉంటే రాష్ట్రానికి బాగుండేదని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలను ఆనాడే ప్రత్యర్థులు మోది దృష్టికి తీసుకువెళ్లారన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వంతో సానుకూల వైఖరితో ఉన్నప్పటికీ వారు చేస్తున్న పలు సూచనలను మాత్రం పెడచెవిన పెడుతూ పరిపాలన సాగిస్తున్నారు. పిపిఎల సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ తదితర అంశాలలో జగన్మోహనరెడ్డి కేంద్రం సూచనలను బేఖాతరు చేస్తూ దూకుడుగానే వెళుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో జగన్మోహనరెడ్డిని లొంగదీసుకునేందుకు కేంద్రం మరో సారి సిబిఐని వాడుకుంటున్నదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.