న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నియమితులు కానున్నారు. ఆయనను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. జస్టిస్ గొగోయ్ తరువాత జస్టిస్ బాబ్డే సీనియారిటీలో రెండవ స్థానంలో ఉన్నారు. జస్టిస్ గొగొయ్ నవంబర్ 17వ తేదీన రిటైర్ కానున్నారు.
జస్టిస్ ఎస్ఎ బాబ్డే మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తూ పదోన్నతిపై సుప్రీం కోర్టుకు వచ్చారు.
1956 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించిన బాబ్డే నాగపూర్ యూనివర్శిటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అయ్యారు. ఏప్రిల్ 2013 నుంచి సుప్రీం కోర్టులో విధులను నిర్వహిస్తున్నారు.
ఆయన 2021 ఏప్రిల్ 23 న పదవీ విరమణ చేయనున్నారు.