(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వచ్చే ఏడాది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నితీష్ కుమార్ పార్టీ, బీజేపీ కలిసి ఆ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు బీహార్ పై ఫోకస్ పెట్టారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న మోదీ.. తన నెక్ట్స్ టార్గెట్ గా బీహార్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో మోదీ తన మంత్రివర్గాన్ని పరిమితంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అవసరాలు, కొందరు మంత్రుల పనిభారాన్ని తగ్గించాల్సి ఉండడంతో మంత్రివర్గాన్ని విస్తరించాలని మోదీ భావిస్తున్నారట. 2020లో బిహార్, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ అవసరాల దృష్ట్యా అక్కడి ప్రజాప్రతినిధులకు కేబినెట్ లో స్థానం కల్పిస్తూ చిన్నపాటి విస్తరణ చేయనున్నారని సమాచారం. బిహార్ లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూకి మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
గత పార్లమెంట్ ఎన్నికల తరువాత కేంద్రమంత్రి వర్గంలో మూడు మంత్రి పదవులు కావాలని నితీష్ కుమార్ బీజేపీని కోరారు. కానీ, మోదీ మాత్రం ఒక్కటే ఇస్తామని చెప్పడంతో.. నితీష్ కుమార్ అలిగారు. తమకు ఆ ఒక్క మంత్రి పదవి కూడా వద్దని చెప్పారు నితీష్ కుమార్. దీంతో బీజేపీకి జేడీయూ దూరం కానుందని ప్రచారం జరిగింది. అయితే, పార్లమెంట్ ఎన్నికలు వేరు, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు వేరని గతంలో నితీష్ వ్యాఖ్యానించారు. బీహార్ లో జేడీయూ, బీజేపీలు కలిసి పనిచేస్తాయని ఆయన ప్రకటించారు. అయితే, 2020లో జరిగే బీహార్ ఎన్నికల్లో ఎన్డిఎ ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారని వార్తలు వచ్చాయి. నితీష్ కుమార్ తప్పుకొని ఆ స్థానాన్ని సుశీల్ మోడీకి ఇవ్వాలని బీజేపీకి చెందిన ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ఎన్డిఎ కూటమిలో మాటల యుద్ధం జరిగింది. కూటమిలోని బీజేపీ, జేడీయూ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఎ తరుపున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బరిలోకి దిగనున్నట్లు బీజేపీలోని కొందరు నేతలు పేర్కొనగా, మరికొంత మంది మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెబుతున్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి రేస్ నుండి తప్పుకుని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. దీంతో రెండు పార్టీల మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే, ఈ అంశం పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని బీజేపీ అధినాయకత్వం గ్రహించింది. బీజేపీ, జేడీయూ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాషాయ పార్టీ పక్క ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే జేడీయూకు కేంద్రమంత్రి వర్గంలో కీలక శాఖలు అప్పగించాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కెప్టెన్ గా నితీష్ కుమార్ ఉంటారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.