చాలా మంది దృష్టిలో రాయలసీమ నీటి సమస్యకు కారణం నీటి కొరత, కృష్ణలో తగ్గిన నీటి లభ్యత అని చెబుతారు. మొదటి నుంచి రాయలసీమ ఉద్యమం మాత్రం సీమలో నీటి నిల్వ ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడం, నిర్మించిన ప్రాజెక్టులు కూడా సీమకు ఉపయోగపడని రీతిలో ఉండటం. రాయలసీమ ఉద్యమం మాట వినని పాలకులు ప్రకృతి చెప్పిన నిజాలను చూడటం కనీస ధర్మం.
అనేక సంవత్సరాల లెక్కలను పరిగణనలోకి తీసుకొని చూస్తే సీమ నుండి వందల టిఎంసిల నీరు క్రిందకు వెళుతుంది. కృష్ణలో నీరు తగ్గిన సమయంలో కూడా తుంగభద్ర , కుందు ఉపనదులు పుష్కలంగా నీటిని తీసుకు వస్తున్నాయి. నేడు నెల్లూరు జిల్లాలోని సోమశిలకు 75 టిఎంసిలు, కండలేరుకు 25 టిఎంసిల నీరు చేరింది కేవలం కర్నూలు, కడప జిల్లాలలోని కుందు , చెయ్యేరు నదులు తెచ్చిన వరద నీరు మాత్రమే. సమస్యకు కారణం ఆ నీటిని రాయలసీమలో నిల్వ చేసుకునే ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడమే.
ఆగస్టు నెల నుండి నేటి వరకు దాదాపు 70 రోజులుగా విడతల వారిగా వరద వచ్చింది. ఆరు సార్లు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజి నిండి వందల టిఎంసిలు సముద్రంలో కలిసింది. కానీ రాయలసీమలో మాత్రం కేవలం 48 టిఎంసిల నీరు మాత్రమే చేరింది. నాలుగు రాయలసీమ జిల్లాల్లో చిన్నా పెద్దా ప్రాజెక్టుల సామర్థ్యం 115 టిఎంసిలు. వాటిలో చేరిన నీరు మాత్రం 48 టిఎంసిలు. సీమ ప్రాజెక్టులకు నీరు అందాలంటే పోతిరెడ్డిపాడు , మాల్యాల, ముచ్చిమర్రి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి బనకచర్ల వరకు ఉన్న 12 కిలో మీటర్ల కాలవ నిర్మాణం నీటిని అందుకునే స్థాయిలో చేయలేదు. బనకచర్ల నుంచి సీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయాల్సిన మూడు పాయల నిర్మాణ సామర్థ్యం వరుసగా 15,12,8 వేల క్యూసెక్కులు. అంటే 2.5 టిఎంసిల నీరు మాత్రమే. ఇక మిగిలింది మాల్యాల , ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి అర టిఎంసి మాత్రమే నీటిని సరఫరా చేయగలం. మొత్తంగా రోజుకు మూడు టిఎంసిల నీరు విడుదల చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. నేడు నెల్లూరు, రాయలసీమలో కలిపి దాదాపు 150 టిఎంసిల నీరు నిల్వ చేశారు. మరో 50 టిఎంసిల నీటి నిల్వకు అవకాశం ఉన్నా చేయలేకపోయారు.
శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని వరదల సమయంలో త్వరితగతిన డ్రా చేయడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వెడల్పును లక్ష క్యూసెక్కులకు పెంచి దానికి అనుగుణంగా బనకచర్ల కాల్వ , అక్కడి నుంచి మూడు పాయలుగా ఉన్న కాల్వల సామర్ధ్యాన్ని కూడా తగిన స్థాయిలో పెంచాలి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిన సమయంలో కూడా పుష్కలంగా నీటిని తీసుకువస్తున్న తుంగభద్ర, కుందు నీటిని నిల్వ చేసుకోవడానికి అనువుగా హెచ్ఎల్సికి సమాంతర కాల్వ, గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయాలి. కుందు నదిపై రాజోలు , జోలదరాసి, ఆదినిమ్మాయని బ్యారేజిల నిర్మాణం చేయాలి. రాయలసీమలోని కుందు , చెయ్యేరు నీటితో సోమశిల నిండి సముద్రం పాలు అవుతున్నా రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు ఉపయోగపడే కండలేరుకు నీరు అందని పరిస్థితిని అధిగమించడానికి సోమశిల – కండలేరు కాల్వ సామర్ధ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచాలి.
గోదావరి నీటిని శ్రీశైలంలో నింపి రాయలసీమ నీటి సమస్యను పరిష్కరించాలనుకుంటున్న ప్రభుత్వం నేడు శ్రీశైలం ప్రాజెక్టులో 70 రోజులుగా నీరు నిండుగా ఉన్నా సీమ ప్రాజెక్టులకు నీరు అందకపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. వరద నీటిని త్వరితగతిన ఉపయోగించుకునే ప్రాధమిక ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. అలా కాని పక్షంలో నేడు శ్రీశైలం నీటిని వాడుకోలేని రాయలసీమ రేపు గోదావరి నీటితో శ్రీశైలం నింపినా అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండవు.
-రాయలసీమ జలసాధన సమితి