(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
శతాబ్దానికి పైగా నానుతున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు వచ్చేవారం తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం బిక్కుబిక్కుమంటూ దాని కోసం ఎదురు చూస్తున్నది. తీర్పు ఏ పక్షానికి అనుకూలంగా వచ్చినా ఎవరూ కూడా ఉద్రిక్తతలకు తావియ్యకూడడదని హిందూ ముస్లిం పెద్దలు చెబుతున్నప్పటికీ ప్రజలు లోలోపల ఆందోళన గానే ఉన్నారు.
అల్లా ఏది చేసినా మంచి కోసమే అంటున్నారు హాజీ మెహబూబ్. రామ్లల్లా విగ్రహాన్ని బాబరీ మసీదు అంతర్భాగంలో 1949లో దొంగతనంగా ప్రతిష్టించినపుడు మొదలయిన న్యాయవివాదంలో మెహబూబ్ రెండవతరం కక్షిదారుడుగా కొనసాగుతున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా ముస్లింలు సహనం పాటించాలని ఆయన కోరుతున్నారు. తీర్పు ఎలా వచ్చినా గానీ శివసావహిస్తామని అందరూ అంటున్నారు. అయితే తీర్పు తమకు అనుకూలంగా రావడం ఖాయమని ఎక్కువమంది హిందువులు నమ్మకంగా ఉన్నారు.
అయోధ్యలో వాతావరణం విషపూరితం కావడానికి బయటివారే కారణమని స్థానిక ముస్లింలు అంటున్నారు. ఈ వాదనను బలపరస్తున్న విధంగా పోలీసులు కూడా బయటివారిపై నిఘా పెడుతున్నారు. బయటివ్యక్తులనూ, ఉద్రిక్తలను సృష్టించడానికి ప్రయత్నించే వారినీ కట్టడి చేస్తే చాలని పోలీసులు అంటున్నారు.
పోలీసులు సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ఫాంల నుంచి రెచ్చగొట్టే సందేశాలు పెట్టేవారిని ముందే గుర్తించేందుకు సైబర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత 36 గంటల్లో ఇలాంటి ఎక్కౌంట్లు పది గుర్తించి వాటిని తొలగించినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రం నాలుగు వేల మంది పారా మిలటరీ బలగాలను అయోధ్య పంపింది.
తీర్పు గురించి అనవసరమైన ప్రకటనలు వద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు మొన్న సూచించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ గురువారం రాత్రి లక్నోలో ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని మూడు గంటల పాటు సమీక్షించారు. అవసరమైతే వాడేందుకు లక్నోలో ఒక హెలీకాప్టర్నూ, అయోధ్యలో మరో హెలీకాప్టర్నూ సిద్ధంగా ఉంచాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.