(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఏంపిఎల్బి) నేడు లక్నోలో సమావేశమవుతున్నది. రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఈ కీలక సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి కూడా హజరయ్యారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల తొమ్మిదవ తేదీన అయోద్య భూ వివాదంపై తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే ఆయోధ్య ట్రస్ట్కు అప్పగించాలనీ అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లలో కక్షిదారుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల స్థలం కేటాయించాలని ధర్మాసనం తీర్పులో పేర్కొన్నది. ఈ తీర్పును సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకరిస్తున్నామని, దానిపై మళ్లీ సమీక్ష కోరే ఆలోచన లేదని చెప్పింది. ఇదిలా ఉండగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము పోరాడింది అయిదు ఎకరాల భూమి కోసం కాదనీ, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఓవైసి పేర్కొన్నారు. సుప్రీం తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అసంతృప్తిగా ఉందని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో అయోధ్య తీర్పుపై సమీక్ష పిటిషన్ దాఖలు చేసే అంశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.