(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతున్నా కొరోనా కేసులు పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ప్రజలను ఆందోళన కల్గిస్తోంది. కొరోనా కేసులు ఎప్పుడు తగ్గుతాయో, లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారోనని ప్రజలు అందరూ ఎదురుచూస్తుండగా నిత్యం పెరుగుతున్న కేసుల సంఖ్యతో రెడ్ జోన్ ఏరియాలు ఎక్కువ అవుతున్నాయి. రెడ్ జోన్ ఏరియాలో లాక్ డౌన్ నిభందనలు పటిష్టంగా అమలు చేస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది. కరోనాతో నేడు మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. చికిత్సల అనంతరం వివిధ ఆసుపత్రుల నుండి 96 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నేడు కొత్తగా కర్నూలు జిల్లాలో 10, గుంటూరు జిల్లా తొమ్మిది, కడప జిల్లా ఆరు, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు, అనంతపురం, కృష్ణా జిల్లాలో మూడు కేసుల చొప్పున నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే కర్నూల్ జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో అత్యధికంగా 184 కేసులు నమోదు కాగా 158 పాజిటివ్ కేసులతో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 83, నెల్లూరులో 67, చిత్తూరులో 53, ప్రకాశంలో 44 కేసులు ఇప్పటి వరకు నమోదు అయ్యాయి.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల వేగం సైతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. శాంపిళ్లు సేకరించి ఫలితాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకి 1000 నుంచి 1200 శాంపిళ్లు తీస్తున్నారు. ల్యాబ్ల సామర్థ్యం పెంపు, ఆధునిక పరికరాలతో ఇక నుంచి రోజుకి 7600 శాంపిళ్ల ఫలితాలు తీయనున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. టెస్ట్ ల నిర్వహణలో ఏపి మూడవ స్థానంలో ఉంది.