కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇటీవల న్యాయస్థానం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు సరిగ్గా టిఆర్ఎస్ ప్రభుత్వం చేయటం లేదని, ఎన్నిసార్లు చెప్పినా ఈ విధంగానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించడం జరిగింది. ఈసారి చేపట్టకపోతే కోర్టు ధిక్కరణ కింద ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాల్సి వస్తోందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వైద్యులకు కూడా కనీస భద్రత కల్పించటం లేదని ప్రభుత్వంకి మొట్టికాయలు వేయడం జరిగింది.
ఈ విధంగా వార్నింగ్ ఇచ్చి రెండు రోజులు గడవక ముందే గాంధీ ఆసుపత్రి వైద్యులు కేసిఆర్ పై అసమ్మతి వ్యాఖ్యలు చేస్తూ వైద్యులు ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు. కరోనా వ్యాధి గ్రస్తులకు చికిత్స విషయంలో ప్రభుత్వం మాకు సరైన భద్రతా కిట్లు ఇవ్వకపోయినా బాధ్యతాయుతంగా పని చేస్తుంటే, కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులకు సంబంధించిన బంధువులు మా పై దాడులు చేస్తున్నారని పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని వాపోతున్నారు. ‘ముఖ్యమంత్రిగారూ ఒక్కసారి గాంధీ ఆసుపత్రికి వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడండి..’ అని మొరపెట్టుకుంటున్నారు.
రూల్స్ ప్రకారం కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుడు దగ్గరికి బంధువులు ఎవరూ రాకూడదు, కానీ పోలీసులు సరిగా పట్టించుకోవటం లేదు భద్రత కరువైంది. కరోనా పేషెంట్ ల దగ్గరకు బంధువులు వచ్చేస్తున్నారు, వైరస్ వ్యాప్తి చెందుతోంది, మాకు కూడా అంటుకుంటుంది అంటూ గాంధీ ఆసుపత్రి ముందు వైద్యులు నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తుల బంధువుల గొడవలు గాంధీ ఆస్పత్రిలో ఎక్కువైపోయాయి అని కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని వైద్యులు కోరుతున్నారు.