నాలుగు నెలల తరువాత మీడియా తెరముందుకు వచ్చిన రాజమండ్రి మాజీ లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ జగన్ పాలనపై సునామీలా విరుచుకుపడటం టిడిపి శ్రేణుల్లో సంబరాన్ని వైసిపి శ్రేణుల్లో నీరసాన్ని నింపింది.రాజకీయ విశ్లేషణల్లో ఉండవల్లి పంథానే వేరుగా ఉంటుంది.జగన్ సర్కార్ ఎక్కడ ఎక్కడ వైఫల్యం చెందింది ఉండవల్లి అరుణ కుమార్ సుదీర్ఘంగా వివరించారు. పలు సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి గట్టిగానే చురకలు అంటించారు.
అయితే ఉండవల్లి అలా ఎందుకు బహిరంగంగా గళం విప్పారు అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.దీనిపై రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఏమిటంటే తనకు అత్యంత ఆత్మీయుడైన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడైన సిఎం జగన్ కళ్లకు ఒక కోటరీ గంతలు కడుతోందని దాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చి ఆయనను సరైన దారిలో పెట్టాలన్నదే ఉండవల్లి ప్రణాళిక అని చెబుతున్నారు.ముఖ్యమంత్రి జగన్ మొండి జగమొండి గా పేరుంది. ఆయనకు పార్టీలో చెప్పే స్థాయిలో ఏ నేత లేరు. ఇక ప్రత్యర్థి పార్టీలు విమర్శించినా, ఆరోపించినా అవి రాజకీయ విమర్శల కిందనే ఫ్యాన్ పార్టీ జమ చేస్తుంది. తప్పులు ఎత్తి చూపేవారు లేకపోగా గతవ ప్రభుత్వంలో చంద్రబాబు భజన బృందాలు ఆయన కళ్ళు కప్పినట్లే జగన్ కోటరీ అంతకు మించి భజంత్రీలు వాయిస్తుంది. దీనికి జతగా అధికారపార్టీకి అండగా ఉన్న సాక్షి మీడియా ఆకాశానికి ఎత్తి వేస్తూ నిత్యం పొగడ్తలతో కాలక్షేపం చేస్తూ పరనింద ఆత్మస్తుతి సాగిస్తుంది. ఈ నేపధ్యం లో స్వర్గీయ వైఎస్ ఆర్ కి అత్యంత సన్నిహితుడు రాజకీయ చాణుక్యుడు ఉండవల్లి అరుణ కుమార్ రంగంలోకి దిగారు.
ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా జగన్ సర్కార్ చేస్తున్న తప్పులను ఒప్పులను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు. దీనివల్ల రాజకీయంగా ఉండవల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఆశించడం లేదు. కనుక ప్రస్తుత ఎపి ప్రభుత్వం ఉండవల్లి అరుణ కుమార్ హెచ్చరికలను తలకెక్కించుకుంటే గాడిలో పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు మాత్రం మరీ ఘాటుగా ఉన్నాయనే చెప్పాలి.కరోనా మాస్కులుతో మొదలుపెట్టి ,ఇసుక ,మద్యం ఇలా అన్ని అంశాలపై ఆయన విమర్శల దాడి కొనసాగింది.
వైరస్ మహమ్మారి పై పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ కుమార్ నాయకుడు అందరికి ఆదర్శంగా ఉండాలని కానీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా మాస్క్ పెట్టుకోకుండా ప్రజలను పెట్టుకోవాలని కోరడం అదే విధంగా అధికారులు ధరించకపోవడం తప్పుడు సంకేతాలను పంపుతాయని హెచ్చరించారు. ఇక ఎపి సర్కార్ ఇసుక అంశంలో ఘోరంగా వైఫల్యం చెందిందని దీనిని ఏడాది అయినా ప్రభుత్వం సరిచేసుకోలేకపోవడం దారుణమన్నారు. పబ్లిక్ గా దొరకని ఇసుక బ్లాక్ మార్కెట్ లో ఎలా సులువుగా దొరుకుతుందో ప్రభుత్వమే చెప్పాలంటూ ఉండవల్లి అరుణ కుమార్ కడిగేశారు.
ఎపి లో మద్యం విధానం ఘోరాతి ఘోరంగా ఉందని ఉండవల్లి అరుణ కుమార్ ఆరోపించారు. సారా విచ్చలవిడిగా పెరిగిపోయిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా చూడని బ్రాండ్లను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల్లో అనేక అనుమానాలకు సర్కార్ తెరతీసిందన్నారు. మద్యం వ్యవహారంలో ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఎందుకూ పనికిరాని భూములకు విపరీతమైన ధరలు చెల్లించి రైతులనుంచి కొనుగోలు చేయడం దేనికోసం ఎవరి కోసం అంటూ ఉండవల్లి అరుణ కుమార్ ప్రశ్నించారు. హడావిడిగా ప్రజలకు స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం వల్ల వైసిపి కి లాభం కన్నా నష్టమే అధికమని వివరించారు.న్యాయవ్యవస్థ తో ప్రభుత్వం వ్యవహరించాలిసిన తీరును ఉండవల్లి అరుణ కుమార్ తప్పుపట్టారు. తనను గతంలో ఇబ్బంది పెట్టిన వారిపై ప్రతీకార చర్యలకు ప్రజలు అధికారం కట్టబెట్టలేదని జగన్ గుర్తించుకుని ముఖ్యమంత్రి పీఠం ఇచ్చిన బడుగులకు న్యాయం చేయాలని సూచించారు.
కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లక పోతే నిన్నటివరకు జేజేలు పలికిన వారే డౌన్ డౌన్ అంటారని గుర్తుపెట్టుకోవాలని జగన్ ని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించడాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలని కూడా పరిశీలకులు చెబుతున్నారు