రాజధాని అమరావతి ప్రాంతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఇళ్లు లేని వారికి ఇంటి పట్టాలు లభించనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన 33వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం లో ఆమోదం తెలిపారు. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు అందివ్వనున్నారు. అమరావతిలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఇప్పటికీ జీవో జారీ అయ్యింది. ఆ జివో ప్రకారం అమరావతి లో 1134.58 ఎకరాల భూమి పేదలకు ఇళ్ల కోసం కేటాయింపు జరగాల్సి ఉంది. మొత్తం 20 లే అవుట్ ల్లో స్థలాలు ఇస్తామంటూ వెల్లడించారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 48,218 మందికి రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తొంది.
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడతలో భాగంగా వీరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీ ఎం జగన్ నిర్ణయించారు. లబ్దిదారులతో డీపీఆర్ తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదనలు సీఆర్డీఏ కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సీ ఎం జగన్ సూచించారు. మే నెల మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమానికి వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల పట్టాలు దక్కనున్నాయి. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమనూరు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు.
YSRCP: అంతా ఉత్తుత్తి ప్రచారమే .. తేల్చేసిన సీఎం వైఎస్ జగన్