Chandrababu Arrest: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి మిగతా వాదనలను గురువారం ఉదయం 11.15 గంటలకు వింటానని తెలిపారు. కాగా బుధవారం ఉదయం నుండి చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ లపై ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. ముందుగా చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, కస్టడీకి అనుమతించాలంటూ వాదనలు వినిపించారు.
చంద్రబాబు తరపు న్యాయవాది దూబే వాదనలు ఇలా..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవని దూబే వాదించారు. అప్పటి ఆర్ధిక శాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ కు వెళ్లి అధ్యయనం చేశారు. ఆమె అధ్యయనం చేసిన తర్వాత సీమెన్స్ ప్రాజెక్టు కు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రాజెక్టు ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్ మెంట్ ధరను నిర్ధారించింది. ఆ కమిటిలో చంద్రబాబు లేరు. కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. సుప్రీం కోర్టు నవంబర్ 16 వరకు ఆయన బెయిల్ పొడిగించింది. చంద్రబాబు కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి ఆ తర్వాత విచారణ చేపట్టారు. రెండు రోజులు కస్టడీలోనూ విచారించారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలని అంటున్నారు. ఆ అవసరం ఏముంది. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు పై కేసు ఎలా పెడతారు. అని దూబే వాదించారు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ఇలా
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది. స్కిల్ స్కామ్ లో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. షెల్ కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు. 2017 లోనే పన్నుల ఎగవేత పై జీఎస్టీ హెచ్చరించింది. సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018 లో 17 ఏ సవరణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదు. స్కిల్ స్కామ్ లో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం. బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి. స్కిల్ స్కామ్ కేసు.. ఇదేమీ పిక్షన్ స్టోరీ కాదని అన్నారు.
ఆధారాలు ఉన్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం, జీవో నెం.4 కంటే ముందు సీమెన్స్ సంస్థతో ఎంవోయూ జరిగింది. సీమెన్స్ తో ఎంవోయూ ను జీవో నెం.4లో ఎందుకు చూపలేదు అని ప్రశ్నించారు. ముద్దాయిలందరికీ ఏదో ఒక స్థాయిలో ఈ కార్పోరేషన్ ద్వారా వ్యక్తిగత లబ్ది చేకూరింది. 2018 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ హెచ్చరికల నేపథ్యంలో కంటితుడుపుగా విచారణ కు ఆదేశించింది. ఆ విచారణ తర్వాత బుట్టదాఖలు చేశారు. సామాజిక, ఆర్ధిక నేరాల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయి. స్కిల్ కేసులో అన్ని చంద్రబాబు సూచనల మేరకే జరిగాయి అని ఏఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.