Pawan Kalyan: వైసీపీ నేతలు రాష్ట్ర సంపదనలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నాల్గవ విడత వారాహి యాత్రలో భాగంగా బుధవారం కృష్ణాజిల్లా పెడనలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ యాత్రలో పాల్గొన్న టీడీపీ మద్దతుదారులకు, పెద్దలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వం అని పవన్ దుయ్యబట్టారు. సీఎం జగన్ కు ఒంట్లో పావలా దమ్ము లేదని విమర్శించారు. వైసీపీ ప్రథకాల్లో అంతా డొల్లతనమేనని అన్నారు. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
తనకు పదవులపై ఆశ ఉంటే 2009 లోనే ఎంపీ పదవిలో ఉండేవాడినని అన్నారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ సర్కార్ పథకాలు అమలు చేస్తొందని అన్నారు. అమలు వరకు వచ్చే సరికి వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేననీ, నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెబుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టిందనీ, సగానికి సగం ఉపాధి హామీ నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై పలు రకాల కేసులు పెడుతున్నారన్నారు. అతి ఎక్కువ రాజద్రోహం కేసులు ఏపీలోనే నమోదు అయ్యాయన్నారు. కేసులకు భయపడితే నాలాంటి వారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే యువత మా సభలకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి మూడు లక్షల ఇళ్లే కట్టారని అన్నారు. ఇళ్ల పేరుతో రూ.4వేల కోట్ల దోచేశారని నివేదకలు చెబుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే జనసేన, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ భ్రష్టుపట్టిస్తోందన్నారు. జగన్ రెడ్డివి వినాశకాలే విపరీత బుద్దిలా ఉందన్నారు. వైసీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. జగన్ ను గద్దె దింపేందుకే టీడీపీతో కలిసి పని చేస్తున్నామని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పార్టీలన్నీ ఏకం అవ్వాలన్నారు. విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలన్నారు.
మంత్రి జోగి రమేష్ డబ్బులు ఎలా తీసుకుంటున్నారో పవన్ వివరించారు. కృత్తివెన్ను ప్రాంతంలో వేల ఎకరాల అక్రమ రొయ్యల చెరువులు తవ్వారని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఫ్లెక్సీలు తయారు చేసే యువత ఉపాధిని దెబ్బ తీశారన్నారు. ఏపీలో కుల భావన ఎక్కువ అని, జాతి భావన తక్కువ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కులాలు ఉన్నా కానీ తెలంగాణా భావన ఎక్కువ అని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం కలిసి కట్టుగా పోరాటం చేయలేకపోయామన్నారు.
ఏపీకి సరైన రాజధాని కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. కొనకళ్ల నారాయణపై నాడు జరిగిన దాడి తనకు చాలా ఆవేదన కల్గించిందన్నారు. తాను ప్రజలకు కులాలుగా విడదీసి రాజకీయాలు చేయనని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను ఆయా కులాల వారితో తిట్టించడం జగన్ నైజమని అన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర యువత కూడా కులాలకు అతీతంగా ఆలోచనల చేయాలని సూచించారు. కాగా పవన్ సభ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహించారు.