Amaravathi : అమరావతి ప్రాంత మహిళా రైతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని కోసం మరో సారి ఆందోళన చేపట్టారు. విజయవాడ వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అమరావతి ప్రాంత మహిళలు ప్రకాశం బ్యారేజీ పైకి తరలివచ్చారు. బ్యారేజీపై మహిళలు భైటాయించి నిరసన తెలియజేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్ ఎక్కించి మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. మహిళల ప్రతిఘటనతో కొద్దిసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాజధాని ప్రాంత వాసులు సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి వచ్చి సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి మహిళలను అడ్డుకున్నారు. దీంతో మందడంలో రైతులు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు.
మరో పక్క రాయపూడి నుండి మందడం వస్తున్న రైతులను వెలగపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైడ్డుపై ముళ్ల కంచెలు వేసి రాకపోకలను నిలువరించారు. మందడం శివాలయం సెంటర్ వద్ద మహిళలు రోడ్డుపై భైటాయించారు. ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం అందిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న మహిళల వద్ద పురుగు మందుల డబ్బాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులు వెలగపూడి లోని సచివాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. ఏడాదికిపైగా నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించారు. ఈ పరిణామాలతో రాజధాని ప్రాంత గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.