AP Assembly: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రెండో రోజూ శాసనసభలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి, సైకో పాలన నశించాలి అంటూ నినదించారు. టీడీపీ సభ్యుల తీరును మంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ సభ్యుల నిరసనపై మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న సభ్యులను బయటకు పంపించాలన్నారు. సభలో నిరసన తెలిపేందుకు కొన్ని విధానాలు ఉంటాయని బుగ్గన అన్నారు.
మంత్రి అంబటి మాట్లాడుతూ సీఎం జగన్ పాలన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై చర్చ జరుగుతుందనీ, అందులో టీడీపీ సభ్యులు పాల్గొనాలని సూచించారు. బాలకృష్ణ సభలో విజిల్స్ వేస్తూ నిరసన వ్యక్తం చేయడంపై అధికార పక్ష సభ్యులు తప్పుబట్టారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీని పది నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారామ్. అనంతరం సభ ప్రారంభం అయిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తుండటంతో చంద్రబాబే సైకో, టీడీపీ సభ్యులే సైకోలు అంటూ పలువురు అధికార సభ్యులు అన్నారు.
చంద్రబాబు అవినీతి బయటపడబట్టే సైకో చంద్రబాబు ఇప్పటికే ఖైదీ 7691 గా జైలులో ఉన్నారంటూ మంత్రి జోగి రమేష్ అన్నారు. సభలో టీడీపీ సభ్యులు వీడియోలు తీస్తున్నారంటూ చీఫ్ విప్ ప్రసాదరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ ను సభలో ఫోన్ లో వీడియోలు తీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. నిన్న సభ్యులకు హెచ్చరిక చేసినా సభలో వీడియో తీస్తున్నారని ..వారిని ఈ సభ నుండి సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలన్నారు.
దీంతో వీడియో తీస్తున్న అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్కిల్ స్కామ్ అంశంపై చర్చ జరుగుతున్న కారణంగా టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సభకు టీ బ్రేక్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని.