కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితే బెటర్ గా ఉందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. నిన్న ఢిల్లీలో వైసీపీ ఎంపీల మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని అన్నారు. ఈ సందర్భంలో కేంద్రంపైనా విమర్శించారు విజయసాయిరెడ్డి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాజధాని పరిధిలోని ఉండవల్లి నుండి గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మనం మన అమరావతి పేరుతో పాదయాత్ర చేపట్టగా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోము వీర్రాజు హజరై మాట్లాడారు. కేంద్ర కంటే పరిస్థితి బాగుంటే .. కేంద్రం ఇచ్చిన బియ్యం ఎందుకు పంపిణీ చేయలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. అంతా బాగుంటే రోజు అప్పుల కోసం ఎందుకు పరుగెడుతున్నారన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధాని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు సోము వీర్రాజు.
ఏపి ప్రజలకు రాజధాని లేకుండా చేశారని సోము వీర్రాజు విమర్శించారు. దీనికి వైసీపీతో పాటు టీడీపీ కూడా కారణమేనని ఆరోపించారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మోసం చేయలేదని అన్నారు సోము వీర్రాజు. అమరావతిలో నిర్మాణాలను వెంటనే ప్రారంభించలనీ, రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రోడ్డు, ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగిందన్నారు. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలకు కూడా కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల భూసేకరణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ సీఎం జగన్ చేసిన విమర్శలకు సోము వీర్రాజు స్పందిస్తూ పోలవరం ఆర్ అండ్ ఆర్ నివేదికను ఇంత వరకూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. జగన్ చెబుతున్నట్లు డబ్బులు ముద్రించే ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని అన్నారు.