Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో నిన్న రాత్రి విజయవాడ నుండి రోడ్డు మార్గంలో రాజమండ్రికిి ఆయన క్వాన్వాయ్ లోనే తరలించారు. అర్దరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్ కు చేరుకున్నారు.
మరో పక్క చంద్రబాబు తరపున ఆయన భద్రత దృష్ట్యా హౌస్ అరెస్ట్ కు అవకాశం ఇవ్వాలని న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విచారణ నిర్వహించేందుకు అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ల పై ఏసీబీ కోర్టు ఇవేళ విచారణ జరగాల్సి ఉండగా .. సీఐడీ మరో కేసులో అరెస్టు కోసం పిటి వారంట్ పిటిషన్ వేసింది.
చంద్రబాబు తదితరులపై 2022 లో నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో అరెస్టు కోరుతూ ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ (ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్) వేశారు సీట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో కోర్టుకు ఆరు వేల పేజీల డాక్యుమెంట్లను సమర్పించినట్లు తెలుస్తొంది. ఈ కేసులో ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా నారాయణ, ఏ 6 గా నారా లోకేష్ ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును విచారించాల్సి ఉందని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.
మరో పక్క చంద్రబాబు తరపున దాఖలు చేసిన హౌజ్ అరెస్టు పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. సీఆర్పీసీలో హౌజ్ అరెస్టు అనేదే లేదనీ పేర్కొంది. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారని, అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని కౌంటర్ పిటిషన్ లో సీఐడీ పేర్కొంది. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్దార్ద్ లూద్రా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. కాగా చంద్రబాబు రిమాండ్ నకు సంబంధించి ఏసీబీ కోర్టు కాపీ ఇంకా అందనందున బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు.