పరిపాలనలో తన దైన ముద్ర చూపిస్తున్న ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పౌరసరఫరాల శాఖలో నూతన ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా లబ్దిదారుల ఇళ్ల వద్దే రేషన్ సరుకుల పంపిణీకి గానూ కొత్తగా ఏర్పాటు చేసిన వాహనాలను గురువారం ప్రారంభించారు.
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ లకు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇతర జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహనాలను ప్రారంభిస్తున్నారు.
నూతనంగా పంపిణీ చేసిన ఈ వ్యాన్ ద్వారా ఫిబ్రవరి 1వ తేదీ నుండి బియ్యం ఇతర రేషన్ సరుకులను నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఈ వాహనాలను రూ.539 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. అదే విధంగా కార్డులు ప్రతి నెలా ఉపయోగించుకునేందుకు గానూ పంపిణీ చేసే బియ్యం సంచులను సీఎం జగన్ ప్రారంభించారు. కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు పాల్గొన్నారు.