YS Jagan: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా అంటూ పేర్కొన్నారు. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసిందని అన్నారు. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందని పేర్కొన్నారు. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు అని జగన్ పేర్కొన్నారు.
కాగా సీఎం జగన్ ఇవేళ అనంతపురం జిల్లా పర్యటన అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. మరో పక్క వైఎస్ఆర్ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తొంది. ఇవేళ అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ రైతు దినోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు పంటల భీమా పరిహారాన్ని అందించనున్నారు. 10.2 లక్షల మంది రైతులకు రూ.1,117 కోట్ల భీమా పరిహారాన్ని సీఎం జగన్ విడుదల చేస్తారు.