YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పార్టీ పరంగా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ ఏర్పాటు మంచి ఫలితాలను ఇస్తొంది. ప్రజలకు పరిపాలన చేరువ అయ్యింది. 50 నుండి వంద కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండటంతో ఆయా కుటుంబాలతో వాలంటీర్ మమేకమవుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించి వారికి లబ్ది చేకూరేలా చూస్తున్నారు. నేరుగా ఇళ్లకు వెళ్లి లబ్దిదారులకు సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం నుండి నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తున్న నేపథ్యంలో వారికి వైసీపీపై అభిమానం ఉన్నా, వైసీపీ సానుభూతి పరులు అయినప్పటికీ వారిని అధికారికంగా పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం కుదరదు.
రీసెంట్ గా వాలంటీర్లు ఓటరులకు ఆధార్ అనుసంధానం కార్యక్రమం చేస్తుంటేనే విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించి ఎన్నికలకు సంబంధించి విధులను వాలంటీర్లకు అప్పగించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పరంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల మంచి ప్రయోజనాలు కనబడుతుండటంతో అలాంటి వ్యవస్థనే పార్టీలోనూ తీసుకురావాలని పార్టీ అధినేతగా సీఎం జగన్ భావించినట్లు ఉన్నారు. ఇప్పటికే వాలంటీర్ పేరుతో ఒక వ్యవస్థ ఉన్నందున ఆ పేరుకు మార్పుగా గ్రామ సారధులను నియమించాలని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమైన సీఎం జగన్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మంది గ్రామ సారధులను నియమించాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశించారు. ప్రతి క్లస్టర్ కు ఇద్దరు గ్రామ సారధులను నియమించాలని ఆదేశించడంతో పాటు ప్రతి సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించాలని చెప్పారు. వాలంటీర్లకు మాదిరిగానే ప్రతి 50 కుటుంబాలకు ఒక క్లస్టర్ గా గుర్తించాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లు పాల్గొనగా రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు కైవశం చేసుకోవాలంటే ఎలాంటి విధానాలు అమలు చేయాలనే దానిపై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రవిభన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన కామెంట్స్