YSRCP: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడినట్లుగా కనబడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సిట్టింగ్ లకు టికెట్ లు కేటాయించి చేతులు కాల్చుకుంది. తెలంగాణలో కేసిఆర్ సర్కార్ పై పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ లు కేటాయించడం వల్లనే వారు ఓటమి పాలైయ్యారనీ, ఆ కారణంగా బీఆర్ఎస్ అధికారానికి దూరం అయ్యిందన్న వాదనలు వినబడుతున్నాయి.
అక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇక్కడి వైసీపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందన్న టాక్ నడుస్తొంది. ఈ పరిణామం ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలను ఆందోళనకు గురి చేస్తొంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో మోహమాటాలకు పోకుండా సర్వేల ఆధారంగానే గెలుపు అవకాశాలు లేని వారిని పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పరిణామంలో తనకు అత్యంత ఆప్తులు, సొంత సామాజికవర్గం వారిని సైతం పక్కన పెడుతున్నారు. రీసెంట్ గా 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను వైసీపీ నియమించింది.
ఇన్ చార్జిగా తొలగించిన వారిలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కూడా ఉండటం విశేషం. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆర్కే .. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత ఆప్తుడు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆర్కే పలు కేసులు కూడా వేశారు. న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. చంద్రబాబు, ఆ పార్టీ మంత్రులను తీవ్రంగా ఇరుకున పెట్టే చర్యలను ఆర్కే చేపట్టారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ పైనే ఆర్కే విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సభల్లో ఆర్కేని గెలిపిస్తే మంత్రి అవుతారని కూడా జగన్ చెప్పారు. మంత్రి అవ్వాలనుకున్న ఆయన కల నెరవేరకపోగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి సన్నిహితుల పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటి అని ఇతర ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. దాదాపు 80 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ .. ఈ విషయంలో స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని, గెలుపు అవకాశాలు ఉన్నవారికి మాత్రమే టికెట్ లు కేటాయిస్తారని అంటున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాల్లోనూ అయిదు లేదా ఆరు మంది సిట్టింగ్ లకు స్థాన చలనం గానీ లేక వారి స్థానంలో కొత్త వారిని ఇన్ చార్జిగా పెట్టడం గానీ జరుగుతుందని సమాచారం. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజికవర్గం నేతలను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలను పక్కన పెట్టినంత మాత్రన ఓటింగ్ లో ఎటువంటి తేడా రాదన్న అంచనాలు పార్టీ ఉందని అంటున్నారు.