CM YS Jagan: రాష్ట్రంలో కౌలు రైతులకు రైతుభరోసా నిధులు నేడు విడుదల అయ్యాయి. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వర్చువల్గా బటన్ నొక్కి నిధుల్ని జమ చేశారు. రాష్ట్రంలోని 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమమోనని అన్నారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగు దారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోందని అని సీఎం తెలిపారు. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం పంపిణీ చేస్తోందని చెప్పారు. 2023–24 సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇదని రైతులకు సాయం చేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
మనందరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో భూ యజమానులకు వైయస్ఆర్ రైతు భరోసా కింద ఏటా.. రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోందని, మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోందని రైతన్నలు బాగుండాలనే ఈ పథకం చేపట్టినట్లు సీఎం వివరించారు. ఇప్పటి వరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు నేటితో మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించామని సీఎం పేర్కొన్నారు.
ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో సాయం
ఫడ్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రూ.38కోట్లతో రైతులకు సాయం చేశామని, వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే వారిని ఆదుకుంటున్నామని సీఎం తెలిపారు. రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగామని అన్నారు. ఏ పంట వేసినా ఈ క్రాప్, ఇన్సూరెన్స్ నమోదవుతోందన్నారు. రైతులు కట్టాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తొందని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పగటిపూటే 9 గంటలు కరెంటు ఇవ్వాలంటే రూ.1,700 కోట్లు పెట్టి ఫీడర్లు అప్గ్రేడ్ చేయాలని డిపార్ట్మెంట్ చెబితే ఆ డబ్బు పెట్టి ఫీడర్లను అప్గ్రేడ్ చేసి పగటిపూటే కరెంటు ఇస్తున్నామని తెలిపారు.