YS Sharmila: ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి సోదరి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణను ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాను తెలంగాణ కోడలిని, తనకు తెలంగాణలో రాజకీయం చేసే అర్హత ఉంది. కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించిన సోనియా గాంధీ ఇండియా కోడలు కాదా అంటూ వ్యాఖ్యానించిన సంగతి అందరికీ గుర్తే ఉంది. ఆమె వాదనలోనూ లాజిక్ ఉంది. అయితే సోదరుడితో విభేదాలో లేక ఇంకా ఏమైనా కారణాలో తెలియదు కానీ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి కొనసాగుతున్నారు. రీసెంట్ గా షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ వార్తలు రావడం, అందుకు బలం చేకూర్చేలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో షర్మిల సమావేశాలు అవుతుండటం తెలిసిందే.
ఏది ఏమైనా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతారని తనకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆమె సోదరుడు వైఎస్ జగన్ తొలి నుండి భావిస్తూ వచ్చారు. అయితే జగన్మోహనరెడ్డి ఊహించని విధంగా వైఎస్ షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వినియోగించుకోవాలని భావిస్తుందని సమాచారం రావడం కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న క్యాడర్ మొత్తం పూర్వ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే. అత్యధికులు వైఎస్ఆర్ అభిమానులే. షర్మిల తెలంగాణలో రాజకీయం చేసినంత వరకూ ఏపీలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తినే వైసీపీలోని అసంతృప్తులు, వైఎస్ఆర్ అభిమానులు షర్మిల పంచన చేరే అవకాశం ఉంటుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది ఆ పార్టీ భావన. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారని ఇప్పటి వరకూ జగన్ ఊహించలేదు. అయితే అనూహ్యంగా ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయాలని భావిస్తుండటం, ఏపీ రాజకీయల్లో ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని భావిస్తుండటమే జగన్ నమ్మలేని నిజంగా ఉంది అని అంటున్నారు.
అయితే తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తాననీ, ఇక్కడ నిధులు, నియామకాలు, నీళ్లు వంటివి ఒకరి సొంతంగా అయిపోయాయనీ, వాటిని ప్రజలకు అప్పగిస్తానంటూ చెప్పుకొచ్చిన వైఎస్ షర్మిల తన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించుకోవడంతో సోషల్ మీడియాలో ఆమె పై విమర్శల దాడి జరుగుతోంది. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలో వై ఎస్ ఆర్ టీపీ ఏ పార్టీకి బీ పార్టీ అని ప్రశ్నిస్తే వారిపై కారాలు మిరియాలు నురిమారు షర్మిల. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటే ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు. నాటి విమర్శలపై ఇప్పుడేమి చెబుతావు షర్మిలక్కా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నీ పదవుల కోసం, నీ టికెట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నావ్ కదా, రేపు ప్రజల కోసం ఏమి చేస్తావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. సొంతంగా సీ ఎం అయి తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని ప్రకటించిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరి తన అస్తిత్వాన్ని కోల్పోతున్నారని అంటున్న వారు ఉన్నారు.
Aditya L -1: సూర్యుడా రెడీ గా ఉండు .. మా ISRO వస్తోంది – కొత్త ప్రాజెక్ట్ అద్దిరింది గురూ !