జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభల్లో జగన్మోహనరెడ్డి సర్కార్ ను, వైసీపీ ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీలో అనేక మంది క్రిమినల్స్ ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చేరి విజిల్స్ వేస్తున్న వారందరూ క్రిమినల్సేనని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ కు క్రిమినల్ అంటే అర్ధం కూడా తెలియదు అనుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు, అతని గుర్తు ఏదో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. కులాల గురించి మాట్లాడను అంటూనే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల గుర్తే లేదనీ, ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తాడో కూడా ఆయనకే తెలియదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్న విశ్వరూప్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని నారాయణ స్వామి అన్నారు.