Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు కాగా రెండు రోజుల క్రితం ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్ధ లూథ్రా, సిద్ధార్ద్ అగర్వాల్ లు వాదించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లు వాదనలు వినిపించారు.
చంద్రబాబు అరెస్టులో సరైన నియమావళి పాటించలేదనీ, 17 ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చూపించారనీ, దీని ప్రకారం పోలీసులు గవర్నర్ అనుమతి తర్వాతే అరెస్టు చేయాల్సి ఉంటుందని వివరిస్తూ గత తీర్పులను ఉదహరించారు. 2020లో నమోదైన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని, అరెస్టు చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదని చంద్రబాబు తరపు వాదనలు వినిపించారు. సీఐడీ ఆరోపించినట్లుగా ఆధారాలు కూడా లేవని తెలిపారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనీ, ఈ విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ బలంగా వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేయగా, కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున దాఖలైన పిటిషన్లు అన్నీ హైకోర్టు డిస్మిస్ చేసినట్లుగా తెలుస్తొంది. దీంతో చంద్రబాబు తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తొంది. క్వాష్ పిటిషన్ లో హైకోర్టులో ఊరట లభిస్తుందని టీడీపీ వర్గీయులు భావించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప లోకాయిక్త కేసుకు సంబంధించి 17ఏ ఆధారంగా సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబుకు అదే రకంగా అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకున్నారు. అయితే చంద్రబాబుకు హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో టీడీపీ వర్గాలు ఖంగుతిన్నాయి. రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
Breaking: కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ.. అసెంబ్లీ సమావేశాలు బహిష్కరణ