ఏపి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న చులకన వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు ఏపి జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలో ఏపి జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వం ఉద్యోగులను చులకనగా చూస్తోందని ఆరోపించారు. మా సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారన్నారు. తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని అన్నారు. సీఎం ఇచ్చిన హామీలు ఒక్కటే నెరవేరలేదని పేర్కొన్నారు.

ఆర్థిక పరమైన అంశాలన్నీ పరిష్కరించాలని సీఎంను కోరామన్నారు బొప్పరాజు. సమస్యలపై మంత్రుల బృందం చర్చలన్నీ చాయ్-బిస్కెట్ చర్చలే అయ్యాయని వ్యాఖ్యానించారు. ఆలస్యమైనా తమకు మేలు చేస్తారని ఇన్నాళ్లూ వేచి చూశామన్నారు. ఇక మాకేమీ చేయరని తెలిసిందనీ, అందుకే ఉద్యమంలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. మా ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే కారణమన్నారు. ఉద్యోగులపై ప్రజలు కూడా సానుభూతి చూపిస్తున్నారని పేర్కొన్నారు. 20వ తేదీ దాటీనా జీతాలు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సరిగా ఇవ్వక ప్రభుత్వ ఉద్యోగులు చులకనగా తయారయ్యారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో భాగమేనని గుర్తించాలన్నారు. తమ ఉద్యమాలకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలను ఆహ్వానిస్తున్నామన్నారు. మార్చి 9వ తదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకూ మొదటి దశ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామనీ, అప్పటికీ తమ డిమాండ్ లను పరిష్కరించకుండా రెండో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు.
ఉద్యమ కార్యాచరణ ఇది
- మార్చి 9, 10 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన
- మార్చి 13, 14న కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన విరామ వేళ ఆందోళన
- మార్చి 15, 17, 20 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు
- మార్చి 21 నుంచి వర్క్ టు రూల్, సెల్ఫోన్ డౌన్
- మార్చి 24న హెచ్వోడీల వద్ద ధర్నాలు చేస్తాం
- మార్చి 27న కరోనా మృతుల కుటుంబాలను కలుస్తాం
- ఏప్రిల్ 1న ఉద్యోగులకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు
- ఏప్రిల్ 3న ప్రతి జిల్లాలో చలో స్పందన, అధికారులకు వినతి పత్రాలు
- ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం
చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు