RK Roja: ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యులు చేసిన ఆందోళనపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు ఇవేళ శాసనసభలో రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని విమర్శించారు. స్పీకర్ ఛైర్కు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నీచంగా ప్రవర్తించారన్నారు. పోడియం పైకి ఎక్కి, ఆయన చుట్టూ చేరి పేపర్లు చింపి మొఖాన విసిరారని అన్నారు. స్పీకర్ ఎదుటనున్న మానిటర్ను లాగేస్తూ.. వారి మంచి నీళ్ల గ్లాసును ఎత్తి పడేసి పగులకొట్టారన్నారు. సభా సాంప్రదాయాన్ని పాటించకుండా అత్యంత జుగుప్సాకరంగా టీడీప సభ్యులు రచ్చ చేశారని మండిపడ్డారు.
బాలకృష్ణ దృష్టిలో అసెంబ్లీ అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నాడేమో.. ఆయన నిండు సభలో మీసం మెలేసి తొడగొడట్టమేంటి..? అసలు ఆయనకు సిగ్గుందా..? లేదా..? అని ప్రశ్నించారు మంత్రి రోజా. మీసం మెలేసి తొడ కొడితే ఇక్కడ భయపడేవాళ్లెవరూ లేరన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం గురించి గానీ, అక్కడ ప్రజల గురించి కానీ ఏరోజూ పట్టించుకోని బాలకృష్ణ ఇవేళ శాసనసభకు వచ్చి బావ కళ్లల్లో ఆనందం చూడటానికి తెగ ఆరాట పడుతున్నారని విమర్శించారు. ఈ మీసాలు తిప్పడమేంటో.. వాళ్ల నాన్న మీద వైశ్రాయ్ హోటల్ దగ్గర చంద్రబాబు చెప్పులేయించినప్పుడు చేసుంటే బాగుండేదని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో దొంగగా ఆధారాలతో సహా దొరికి చంద్రబాబు జైలుకెళ్తే.. ప్రజలకు కోర్టులు, చట్టాల పట్ల నమ్మకం కలిగిన తరుణంలో బాలకృష్ణ ఈ స్థాయికి దిగజారడం నీచాతినీచంగా చూడాలన్నారు.
బాబు అరెస్టుపై చర్చిస్తామంటే..
చంద్రబాబు నాయుడి స్కిల్ స్కామ్ అవినీతి ఆధారాలను శాసనసభలో అధికార వైసీపీ పెద్ద పెద్ద స్క్రీన్లపై డిస్ప్లే చేసి మరీ చర్చ పెడుతుందనే భయంతో టీడీపీ నేతలు రివర్స్ డ్రామాకు తెరదీశారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టి గొడవ చేయాలనేది టీడీపీ ప్లాన్ గా ఉందన్నారు. ఇది తెలిసి మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ చాలా క్లారిటీగా చర్చకు సిద్ధమని చెబుతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా చర్చకు రెడీగా ఉందని.. వాళ్లు ప్రజాధనం దోపిడీ ఏవిధంగా చేశారో నిరూపిస్తామన్నా ఏదో విధంగా ఆ చర్చను సాగనీవ్వకుండా తామంతా శాసనసభ బయటకెళ్లాలనే దుర్బుద్ధితోనే టీడీపీ సభ్యులు ఈరోజు హంగామా సృష్టించారని మండిపడ్డారు మంత్రి రోజా. కేవలం జనాల్లో పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతలు ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నారని అర్ధమౌతుందని రోజా అన్నారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా