ఏపీ – తెలంగాణ మంత్రుల మధ్య మళ్లీ మాటల యుద్దం స్టార్ట్ అయ్యింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. తెలంగాణ విద్యా వ్యవస్థ, విద్యార్ధులను ఏపి మంత్రి బొత్స అకారణంగా అవమానించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో చూసి పరీక్షలు రాస్తున్నారని చేస్తున్న బొత్స వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చకు నన్ను రమ్మంటారా..? మీరు వస్తారా? అని సవాల్ విసిరారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి .. పోనీ హైదరాబాద్ .. ఎక్కడైనా సరే చర్చకు తాను సిద్దమని ప్రకటించారు. మీ విద్యార్ధులు మా విద్యార్ధులతో పోటీ పడితే అసలు విషయం బయటపడుతుందని అన్నారు.
ఏపి నుండి చదువు కోవడానికి తెలంగాణకు వస్తున్నారే తప్ప.. తెలంగాణ వాళ్లు ఏపీకి పోవడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అందరినీ సమానంగా చూసి ఉంటే రెండు రాష్ట్రాలు కలిసి మెలసి ఉండేవనీ, మీ లాంటి వ్యక్తుల వ్యాఖ్యలతోనే తెలంగాణ విడిపోయిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే రకరకాల ఇబ్బందులని కానీ అదే మా దగ్గర యాదాద్రి, వేములవాడ, రామప్ప, భద్రకాళి ఎక్కడైనా సరే అందరికీ ఒకే రకంగ చూస్తామన్నారు. తమ పార్టీ బీఆర్ఎస్ కు ఏపీ నుండి కూడా ఆదరణ ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ ఏపి మంత్రి బొత్స సత్యనారాయణవి అవగాహన లేని వ్యాఖ్యలన్నారు. అవి తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని మండిపడిన ఆమె.. బొత్స ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంత స్థాయి మీకు లేదని అన్నారు. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థ పై చర్చించేందుకు మంత్రి బొత్స సిద్దమా అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. అంతకు ముందు ఏపిపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులు మాటల యుద్దం జరిగింది. మరల ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో మళ్లీ దుమారం రేగింది.
నిన్న ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందు మాట్లాడుతూ సర్వీస్ కమిషన్ పరీక్షలే సరిగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలపైనా కామెంట్స్ చేశారు. ఉపాధ్యాయులు బదిలీలు కూడా తెలంగాణ వాళ్లు చేసుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో వ్యవహారాలు రోజు పేపర్ లో చూస్తున్నామనీ, వారితో ఎలాంటి పోలిక వద్దంటూ అభిప్రాయపడ్డారు మంత్రి బొత్స. వాస్తవానికి ఇక్కడ నారద పాత్రను మీడియా పోషించింది. తెలంగాణలో జరుగుతున్న ఇంజనీరింగ్ ప్రవేశాలపై మీడియా ఆయనను ప్రశ్నించడంతో బొత్స అన్యోపదేశంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రాన్ని కంపేర్ చేయొద్దని మీడియాకు సూచించిన మంత్రి బొత్స..ఎవరి విధానం వారికి ఉంటుందన్నారు. ఎవరి ఆలోచన వారిదన్నారు. ఎవరి లేన్ వాళ్లదనీ, ఎవరిపైనా కామెంట్స్ చేయడం లేదంటూనే సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపిలో అమలు చేస్తున్న విద్యా విధానం దేశంలో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు బొత్స. ఏపి గురించి గొప్పగా చెబుతూ తెలంగాణపై కామెంట్స్ చేయడంతో అక్కడి మంత్రులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ మంత్రుల సవాల్ పై మంత్రి బొత్స ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
‘పంచకర్ల’ పయనమెటు ..? ఆప్షన్ ఆ ఒక్క పార్టీయే(కదా)..!