ఎన్నికల సమయంలో తరచుగా అందరికీ పరిచయమయ్యే గుర్తులు ఇవే. ఇస్త్రీపెట్టె, రోడ్డు రోలర్, చపాతీ కర్ర, ఆటో రిక్షా, గాలిపటం, పెన్ను, పలక, బ్లాక్ బోర్డు, విజిల్, టోపీ వంటి కొన్ని ప్రత్యేక గుర్తులు తెరమీదికి వస్తాయి. వీటిని ఆయా ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తారు. ఆయా గుర్తులను ఎన్ని కల వేళ అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకు వెళ్తారు. వాటిని ప్రజలు ఆదరిస్తే.. అభ్యర్థులు గెలుపు గుర్రాలు ఎక్కుతారు. దీంతో గుర్తులకు ఎన్నికల సమయంలో ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది.
అయితే.. ఇప్పుడు కొన్ని గుర్తులపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. వాటిలో ఆటోరిక్షా, చపాతీకర్ర, రోడ్డు రోరల్, ఇస్త్రీపెట్టె వంటివి ఉన్నాయి. ఈ గుర్తులను ఎవరికీ కేటాయించేది లేదని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ గుర్తులను ఎవరికీ ఇవ్వబోమని పేర్కొంది. దీంతో ఆటోరిక్షా, చపాతీకర్ర, రోడ్డు రోరల్, ఇస్త్రీపెట్టె వంటివి ప్రస్తుత ఎన్నికల్లో కనిపించవు.
ఇక, దీనికి కారణం కూడా ఉంది. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే ప్రధానం. అభ్యర్థి ఎంత తెలిసిన వాడైనా.. ఓటు మాత్రం `గుర్తు`పైనే వేయాలి. గుర్తు విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. న్యాయ పోరాటాలు చేసిన అభ్యర్థులు.. పార్టీలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు.. కారు. అయితే.. రోడ్ రోరల్, ఆటో రిక్షా.. వంటివి.. కారు గుర్తును పోలి ఉంటున్నాయి. దీంతో కొందరు కారుకు వేయాల్సిన ఓటును రోడ్ రోరల్, ఆటోరిక్షా వంటివాటిపై గుద్దే స్తున్నారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. అయితే.. చపాతీకర్ర..(రెండు రెక్కలు ఉన్నట్టుగా ఉంటుంది), క్యాప్( ఒక రెక్క ఉన్నట్టుగా ఉంటుంది), ఐరన్ బాక్స్ వంటివాటితో తమకు ఇబ్బందులు వస్తున్నాయి. వైసీపీకి పడాల్సిన ఓటు వీటిపై పడిపోతోందనేది వైసీపీ నేతల ఆవేదన. దీంతో ఈ గుర్తులను ఎవరికీ కేటాయించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.