తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై సీబీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. వివేకాను సునీల్ యాదవ్ ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడని సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన రాత్రి సునీల్, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి ఇంటికి వెళ్లాడని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుద్యం పెరిగిందనీ, ఎంపీ టికెట్ అవినాష్ కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని సీబీఐ వివరించింది. ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకు ఇవ్వాలని వివేకా కోరినట్లుగా సీబీఐ వెల్లడించింది. వివేకా రాజకీయ వ్యూహాలు అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డికి నచ్చలేదని, శివశంకర్ రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి కుట్ర పన్నినట్లుగా కనిపిస్తొందని సీబీఐ దర్యాప్తులో తేల్చింది.
వివేకా మృతి సమాచారం కృష్ణారెడ్డి ద్వారా రాకముందే అవినాష్ రెడ్డికి హత్య గురించి ముందే తెలుసుననీ, ఘటనా స్థలంలో సాక్షాలను చెరిపివేయడంలో కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ పేర్కొంది. ఈ హత్య కేసులో నిందితులు సునీల్, గజ్జల ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి ఉదయం 5.20 గంటలకు భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నారనీ, వీరి ముగ్గురి ప్రమేయం బయటకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొంది. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా ను చూసి గుండెపోటుతో మరణించారని స్థానిక నేత శశికళకు సమచారమిచ్చారని సీబీఐ వెల్లడించింది.
ఆ తర్వాత అవినాష్ రెడ్డి తన సెల్ ఫోన్ నుండి రెండు నెంబర్ లకు కాల్ చేసి వివేకా మృతిపై సమాచారం అందించారని తెలిపింది సీబీఐ. కుట్రపూరితంగా గుండెపోటు కథనాన్ని అల్లారని సీబీఐ తెలిపింది. వివేకా గుండెపోటుతో చనిపోయారని సీఐకి సమాచారం ఇచ్చారనీ, నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారనీ, వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టారని కోర్టుకు సమర్పించిన కౌంటర్ లో సీబీఐ పేర్కొంది.
Supreme Court: ‘మహా’ శివసేన పంచాయతీ.. సుప్రీం కోర్టులో ఉద్దవ్ వర్గానికి లభించని ఊరట