తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవేళ కీలక భేటీ జరిగింది. అయితే ఎటువంటి నిర్ణయాలు లేకుండానే అసంపూర్తిగా సమావేశం ముగిసింది. మరో సారి భేటీ కావాలా వద్దా అన్న నిర్ణయం కూడా లేకుండానే భేటీ ముగించారు. రాష్ట్రాల విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా ఏపి, తెలంగాణ మధ్య దాదాపు అన్ని అంశాల్లోనూ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్), ఇతర ఉన్నతాధికారులను ఆహ్వానించింది. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉండగా వీటిలో ఏడు అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఏడు అంశాలు ఏపికి సంబంధించినవి ఉన్నాయి.
సమావేశం సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపి ప్రభుత్వం కోరగా ఇప్పటికే ఇచ్చిన రూ.15వేల కోట్లకు వివరాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరింది. ఇక రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. రైల్వే జోన్ నిర్ణయాన్ని కేబినెట్ కు వదిలివేయాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఏపి అధికారులు కోరగా ఇదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని హోంశాఖ అధికారుుల పేర్కొన్నారు. షీలా బిడే కమిటీ సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని హోంశాఖ అధికారులు తెలపగా, తెలంగాణ అంగీకరించకపోయినా హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చని ఏపి తెలిపింది. దీనిపై న్యాయనిపుణుల సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
ఏపి లేవనెత్తిన అంశానికి తెలంగాణ సమ్మతి తెలపలేదు. ఏపి ఫైనాన్స్ కార్పోరేషన్ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు చెప్పగా, పౌరసరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్నాయని ఏపి అధికారులు ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం సింగరేణిని పంచాలని ఏపి ప్రభుత్వం కోరగా, తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 51 శాతం ఈక్విటీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నందున సింగరేణి విభజన అంశం ఉత్పన్నం కాదని పేర్కొంది. సింగరేణికి ఉన్న ఏకైక అనుబంధ సంస్థ ఏపి హెచ్ఎంఈఎల్ లో మాత్రమే ఏపి కి ఈక్విటీ వర్తిస్తుందని తెలుపగా ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారులను హోంశాఖ కార్యదర్శి ఆదేశించారు.
విభజన చట్టంలో పేర్కొన్న 12 సంస్థలనూ విభజించాలని ఏపి కోరగా తెలంగాణ పూర్తిగా వ్యతిరేకించింది. ప్రతి విషయంలోనూ అభ్యంతరాలు, అవాంతరాలు సృష్టించుకుంటూ పోతే విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని కేంద్రం పేర్కొంది. విభజన చట్టంలో పన్నులకు సంబంధించి 50, 51, 56 సెక్షన్ల లో లోపాలను సరిదిద్దేందుకు చట్టాన్ని సవరించాలని ఏపి ప్రభుత్వం కోరగా ఎనిమిదేళ్ల తర్వాత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదించింది.