Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీం కోర్టులోనూ ఇవేళ ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును ఏపీ సీఐడీ ఈ నెల 9వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. గత 17 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు తరపున ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు.
ఈ రోజు చంద్రబాబు కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్ వీ ఎన్ భట్ ల నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా, సిద్దార్ధ్ అగర్వాల్, ప్రమోద్ కుమార్ లు, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ వాదనలు వినిపించేందుకు సిద్దమైయ్యారు. అయితే ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి ఎస్ వీ ఎన్ భట్టి విచారణకు విముఖత చూపడంతో (నాట్ బీఫోర్ మీ అనడంతో) న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా ఎస్ఎల్పీ పై విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తన సహచరుడు జస్టిస్ భట్టి కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారని జస్టిస్ ఖన్నా పేర్కొనగా, వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం చూద్దామని జస్టిస్ ఖన్నా తెలుపగా, ఒక సారి సీజేఐ దృష్టికి తీసుకువెళతానని సిద్ధార్ధ లూథ్రా తెలియజేయగా, మీరు కలవొచు, ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఖన్నా తెలియజేశారు. వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదనీ న్యాయవాది హరీష్ సాల్వే అనగా, చీఫ్ జస్టిస్ ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తామని లూథ్రా అంటున్నారని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు.
సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వాలని హరీష్ సాల్వే కోరగా, సోమవారం అవకాశం లేదు, వచ్చే వారం తప్పకుండా వింటామని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో సిద్దార్ధ లూథ్రా ఒక అయిదు నిమిషాలు తనకు సమయం ఇవ్వాలని కోరగా జస్టిస్ ఖన్నా పాస్ ఓవర్ ఇచ్చారు. రేపటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకూ సుప్రీం కోర్టుకు సెలవులు ఉండటంతో తక్షణం వేరే బెంచ్ కి మార్పు కోసం చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సీజేఐ ముందుకు వెళ్లినట్లు గా తెలుస్తొంది. వేరే బెంచ్ కు కేసు ఈ వేళ మార్పు జరగకపోతే అక్టోబర్ 3వ తేదీ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరో పక్క సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు పిటిషన్ లపై విచారణ ముందుకు సాగలేదు. చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.