Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముడుపుల వ్యవహారంలో కీలక పాత్రధారులు ఒక్కరొక్కరుగా విదేశాలకు పారిపోతున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్ధసాని ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయారు. వీరిద్దరి పేర్లు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఉండటంతో సిట్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న మనోజ్ వాసుదేవ్ దుబాయ్ కి పారిపోయినట్లుగా ఏపీ సీఐడీ గుర్తించింది. పెండ్యాల శ్రీనివాస్ సెప్టెంబర్ 6న అమెరికా వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న శ్రీనివాస్.. చంద్రబాబు ఐటీ నోటీసుల వ్యవహారం బయటకు రావడంతో ఈ నెల 5న లీవ్ లెటర్ ఇచ్చేసిన వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
తాజాగా లోకేష్ అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్ చౌదరి కూడా దేశం విడిచి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. చంద్రబాబు సీఐడీ కస్టడీ విచారణ కూడా జరుగుతోంది. రేపో మాపో నారా లోకేష్ ను కూడా సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ నేతృత్వంలో పలువురు అధికారుల బృందం ఢిల్లీకి చేరుకోవడంతో లోకేష్ ను అరెస్టు చేయనున్నారు అనే వార్తలకు బలం చేకూరుతోంది. ఈ తరుణంలోనే లోకేష్ కు పీఏగా వ్యవహరించిన కిలారు రాజేష్ నిన్న రాత్రి ఢిల్లీ నుండి అమెరికాకు చెక్కేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
మరో పక్క మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రామోజీ కోడలు శైలజా కిరణ్ (ఏ 2) కూడా అమెరికా వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒక్కరొక్కరుగా దేశం విడిచి వెళ్లిపోవడం వైసీపీ వర్గాలకు ఆయుధంగా మారుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తప్పు చేయకపోతే దర్యాప్తు అధికారులకు సహకరించి విచారణను ఎదుర్కోవాలే కానీ ఇలా దేశం విడిచి ఎందుకు వెళ్లిపోతున్నారని సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.