TDP Vs Samajwadi Party: ఏపీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటొంది అనేది అందరికీ తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబుపై వరుస కేసులు వెంటాడుతుండటంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేకుండా పోయింది. జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఉన్నారు. కానీ ఈసీ వద్ద మాత్రం ప్రాంతీయ పార్టీ హోదా మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన పదేళ్ల తర్వాత ములాయం సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన సమాజ్ వాదీ పార్టీ మాత్రం అనేక రాష్ట్రాల్లో పోటీ చేసింది. ఉత్తరప్రదేశ్ తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఏ ఇతర రాష్ట్రంలో పోటీ చేయకపోగా, పార్టీ పునాదులు ఉన్న పక్క రాష్ట్రంలో కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉంది. తెలంగాణ ఎన్నికలకు జాతీయ పార్టీ బీజేపీ .. జనసేనతో చర్చలు జరిపి పొత్తు పెట్టుకుంది కానీ టీడీపీతో పొత్తు ఆలోచన కూడా చేయలేదు. ఏ రాజకీయ పార్టీ టీడీపీ మద్దతు కోరలేదు. టీడీపీ కూడా ఏ రాజకీయ పార్టీకి బహిరంగ మద్దతు తెలియ చేయనూ లేదు.
ఈ విషయాలు అన్నీ పక్కన పెడితే ..ఏపిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆందోళన కల్గించే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్ధులను పోటీ పెట్టనుందట. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయవచ్చు అని అందరూ అనుకుంటారు. ఇప్పటికే యూపీతో పాటు అనేక రాష్ట్రాల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తూనే ఉంది. అయితే సమాజ్ వాదీ పార్టీ ఏపీలో పోటీ చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే .. ఆ పార్టీ ఎన్నికల గుర్తు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తూ ఒక్కటే (సైకిల్) కావడం.
రీసెంట్ గా విశాఖలో సమాజ్ వాదీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు ఆ పార్టీ అధ్వర్యంలో నిర్వహించారు. ఆ సందర్భంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు రాబోయే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఏపీలోనూ పోటీ చేస్తుందని వెల్లడించారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తే ఎన్నికల సంఘం సైకిల్ గుర్తును ఏ పార్టీకి కేటాయిస్తుంది అన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది. దీంతో సమజ్ వాదీ పార్టీ జాతీయ పార్టీ కనుక గుర్తు వాళ్లకు ఇవ్వాల్సి వస్తుందనీ, ఇక ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీకి ఎన్నికల సంఘం మరో (సైకిల్) ఎన్నికల గుర్తు కేటాయిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ సైకిల్ కు డేంజర్ బెల్స్.. పోటీకి మరో సైకిల్ రెడీ అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ రెండు పార్టీల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు 1982 లో ప్రారంభించారు. ప్రారంభించిన ఏడాదిలోనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక సమాజ్ వాదీ పార్టీని 1992లో జనతా పరివార్ పార్టీలకు చెందిన పూర్వపు సోషలిస్ట్ లు, ఇతర నేతలతో కలిసి ములాయం సింగ్ యాదవ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఎన్నికల సంఘంలో ప్రాంతీయ పార్టీ హోదాలోనే ఉన్నాయి. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ అధ్యక్షులుగా ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పోటీ చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ పార్టీకి ఈసీ సైకిల్ ఎన్నికల గుర్తు కేటాయించింది. అయితే ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల గుర్తుగా సైకిల్ లేకపోవడంతో సమాజ్ వాదీ పార్టీకి కలిసి వచ్చింది. అయితే ఏపీలో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తే ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా లేకపోవడం వల్ల వేరే ఎన్నికల గుర్తు కేటాయించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
YCP MP Vijayasai Reddy: ‘ఆ ఇద్దరి విలువలు లేని రాజకీయాలకు ఇది నిదర్శనం’